Eagle Team: నల్లగొండలో మత్తు టాబ్లెట్ల అక్రమ విక్రయాల దందాను ఈగల్ టీమ్ అధికారులు నల్లగొండ(Nalgonda) పోలీసులతో కలిసి గుట్టు రట్టు చేశారు. మత్తుకు బానిసగా మారి, అదే దందాను మొదలుపెట్టిన ఓ పెడ్లర్ సహా మెడికల్ షాప్ యజమాని, మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 10 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 2,400 స్పాస్మో ప్రాక్సీవన్ ప్లస్ టాబ్లెట్లు(Spasmo Proxyvan Plus Tablet), 345 ట్రమాడోల్ మాత్రలు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
మునుగోడు రోడ్డులో..
మత్తు మాత్రల దందా జరుగుతున్నట్లు అందిన సమాచారంతో, ఈగల్ టీమ్(Eagle Teame) అధికారులు సోమవారం మునుగోడు(Munugodu) రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణానికి చెందిన మహమ్మద్ జబీనుల్లా (35) పెద్ద మొత్తంలో మాత్రలను తరలిస్తూ పట్టుబడ్డాడు. విచారణలో జబీనుల్లా కొంతకాలంగా మాత్రలకు బానిసగా మారి, ఆర్థిక సమస్యల కారణంగా వాటినే ఇతరులకు అమ్మడం మొదలుపెట్టినట్లు తేలింది. ఒక్కో స్ట్రిప్ను రూ.100కు కొని, రూ.200కు అమ్ముతున్నట్లు నిర్ధారణ అయ్యింది.
Also Read: Crime News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు మృతి
గోప్యంగా..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వెంకట రమణ మెడికల్ స్టోర్(Venkata Ramana Medical Store) యజమాని ధరమ్ కృష్ణసాయి ఎలాంటి వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే జబీనుల్లాకు మాత్రలు అమ్ముతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ధరమ్ సాయికృష్ణను కూడా అరెస్ట్ చేసిన అధికారులు, మెడికల్ షాపు లైసెన్స్ను రద్దు చేశారు. జబీనుల్లా నుంచి మాత్రలు కొనుగోలు చేస్తున్న షేక్ ఫిరోజ్, అహ్మద్ అబ్దుల్ హఫీజ్, షేక్ ఒవైజ్, షేక్ అఫ్రోజ్, మహమ్మద్ జావీద్లను కూడా అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాల క్రయవిక్రయాలపై ప్రజలకు సమాచారం తెలిస్తే, వెంటనే 87126 71111 లేదా 1908 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలని ఈగల్ టీమ్ అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
Also Read: Huzurabad: ఫైర్ సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలిన టపాకాయల దుకాణం.. భయం గుప్పిట్లో హుజురాబాద్
