Online Gaming Sites: బెట్టింగ్ యాప్స్(Betting Apps) పై రాష్ట్ర సర్కారు(Telangana Govt) ఉక్కుపాదం మోపుతున్న వేళ.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రం కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్(GST Council) ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలపై కొరడా ఝళిపించింది. దేశంలో అక్రమంగా ఆన్ లైన్ గేమింగ్ యాప్ లను నడిపిస్తున్న పలు కంపెనీలకు చెందిన దాదాపు 357 వెబ్ సైట్లను డీజీజీఐ(Directorate General of GST Intelligence) బ్లాక్ చేసింది. సదరు కంపెనీలు ఇల్లీగల్ గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని జీఎస్టీ ఇంటెలిజెన్స్అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా వాటికి సంబంధించిన 2,400 బ్యాంక్ అకౌంట్లను కూడా బ్లాక్ చేసింది. తద్వారా రూ. 126 కోట్లు ప్రీజ్ చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆర్థికశాఖ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేసింది. గేమింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని తెలిపింది. అదేవిధంగా ఇల్లీగల్ ప్లాట్ ఫామ్స్ కు ప్రకటనలు ఇవ్వడంపై బాలీవుడ్ తో పాటు ఇతర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను కూడా హెచ్చరించింది.
కాగా,దాదాపు 700 గేమింగ్ కంపెనీలను ప్రస్తుతం డీజీజీఐ(DGGI) పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, పన్నులు ఎగవేస్తూ, నిబంధనలు అతిక్రమిస్తున్న కంపెనీలపై జీఎస్టీ కౌన్సిల్ నిఘా పెంచింది. ఈ ఆఫ్షోర్ కంపెనీలు లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ‘మ్యూల్’ బ్యాంక్ ఖాతాల ద్వారా పనిచేస్తున్నాయని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో డీజీసీఐ 166 ‘మ్యూల్’ అకౌంట్లను బ్లాక్ చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇక, తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. వాటిని ప్రమోట్ చేసిన కొందరు తెలుగు యూట్యూబర్లు, ఇన్ ప్లూయెన్సర్లు ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కు బానిసలవుతూ అమాయక యువకులు ఆత్మహత్య పాల్పడుతుండటం రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.
ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల మీద కేసులు పెట్టి విచారిస్తోంది. ప్రముఖ ఇన్ ప్లూయెన్లర్లు రీతూ చౌదరి, విష్ణుప్రియ తదితరులను పోలీసులు విచారించారు. యాంకర్ శ్యామల లాంటి వాళ్లు కోర్టుకు వెళ్లి అరెస్ట్ చేయకుండా బెయిల్ తెచ్చుకున్నారు. ఇక, హర్షసాయి లాంటి వాళ్లు దుబాయ్ చెక్కేశారు.
ఏదిఏమైనా.. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ అంశం, పలువురు సెలబ్రిటీల విచారణ కొనసాగినట్లు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ నడుస్తోంది. అయితే.. ఇప్పటికైనా సర్కార్ ఈ అంశంపై దృష్టి పెట్టినందుకు నష్టనివారణ చర్యలు చేపట్టినందుకు ఒకవైపు హర్షం వ్యక్తమవుతుంది. బెట్టింగ్ యాప్స్ గురించి పెద్దలకు కూడా అవగాహన ఏర్పడుతోంది. యువతలో భయం పెరుగుతోంది. అయితే మరోవైపు ఉన్నట్టుండి ఈ హడావుడి అంతా కొన్నాళ్లే, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అని పెదవి విరుస్తున్నారు.
ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం పక్కనపెడితే ప్రస్తుతం ఇదొక ఉద్యమంలాగా నడుస్తోంది. బెట్టింగ్ యాప్స్ పై సాగుతున్నఈ సమరం కొందరికైనా మంచి చేయకపోతుందా, వాటి ఊబిలో చిక్కుకన్న అమాయకులు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతారా అని ఆశ.