Hyderabad: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఓ కంపెనీ ఎండీని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. వారి కుటుంబ సభ్యులతో రూ. 4 కోట్లు తెప్పించాలని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు అందిందని గ్రహించి ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టించుకుని పరారయ్యారు. బాధితుడితో గతంలో కలిసి వ్యాపారం చేసిన వ్యక్తే ఈ కిడ్నాప్కు సూత్రధారి అని భావిస్తున్నారు.
గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వద్ద కిక్స్టార్ట్ కంపెనీ నిర్వహిస్తున్న ఎండీ సాయి గుప్తా శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇంటికి బయల్దేరారు. అదే కంపెనీలో సేల్స్ కోఆర్డినేటర్గా పని చేస్తున్న సతీశ్ రెడ్డి కూడా అదే కారులో ఉన్నారు. కాగా, ఫార్చూనర్, ఐ20 కార్లలో వచ్చిన కొందరు దుండగులు వెనుక నుంచి వచ్చి కారును ఢీకొట్టారు. తాము ఎస్వోటీ పోలీసులమని చెప్పి వారిద్దరిని ఫార్చూనర్ కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి తొలుత జగద్గిరిగుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సాయి గుప్తాను, సతీశ్ రెడ్డిని చితకబాదారు. రాత్రి ఒంటి గంట వరకు కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. రూ. 4 కోట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెప్పించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఇద్దరు బాధితుల కుటుంబాలు శనివారం వారి కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాయి. పోలీసులు వారిపై నిఘా మొదలు పెట్టారు. ఈ విషయం గ్రహించిన దుండగులు ఖాళీ బాండ్లపై వారితో సంతకాలు చేయించుకుని వికారాబాద్లనే వారిని వదిలేసి పారిపోయారు.
సాయిగుప్తాతో గతంలో గౌతమ్ బవిరిశెట్టి పార్ట్నర్షిప్లో ఫైనాన్స్ వ్యాపారం చేశారు. ఆ తర్వాత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయమై గొడవలు జరిగాయి. అనంతరం, తాజాగా, సాయిగుప్తాను గౌతమ్ బవిరిశెట్టి కిడ్నాప్ చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో గౌతమ్, రౌడీ షీటర్ ప్రశాంత్తోపాటు 13 మంది ఉన్నట్టు బాధితులు వెల్లడించారు. ప్రస్తుతం కిడ్నాప్ సూత్రధారి గౌతమ్ పోలీసుల అదుపులో ఉన్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిసింది.