YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఏపీపై మెుంథా తుపాను (Cyclone Montha) ప్రభావం గురించి ఎక్స్ వేదికగా ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (Central Govt)పై విరుచుకుపడ్డారు. ఉత్తరాధిలోని బీజేపీ పాలత రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తు సంభవిస్తే దానిని వెంటనే జాతీయ విపత్తుగా ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రకటిస్తారని షర్మిల గుర్తుచేశారు. అదే ఏపీ విషయానికి వచ్చేసరికి సవతి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. మొంథా తుపాను ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
’30 శాతం పంటను కోల్పోయాం
ఏపీ ప్రజల అండతో మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన ప్రధాని మోదీ.. ఆపద సమయంలో ముఖం చాటేసి మరోమారు తీవ్ర అన్యాయం చేశారని షర్మిల విమర్శించారు. మరోవైపు మెుంథా తుపాను రైతన్నలకు అపార నష్టాన్ని కలిగించి తీరని శోకాన్ని మిగిల్చిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా నీట మునిగాయి. ఖరీఫ్ సీజన్ లో సాగైన పంటల్లో 30 శాతం పనికి రాకుండా పోయాయి. 10 లక్షల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది రాష్ట్ర రైతాంగానికి సంభవించిన మహా విపత్తు. రూ.20వేల కోట్లకు పైగానే రైతులకు జరిగిన అపార నష్టం ఇది’ అని షర్మిల అన్నారు.
‘రూ.10 వేల కోట్లు ఇవ్వాలి’
మెుంథా తుపాను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ తరపున కేంద్రాన్ని షర్మిల్ డిమాండ్ చేశారు. ‘ప్రళయం మిగిల్చిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను రాష్ట్రానికి పంపాలి. అంచనా నివేదికలొచ్చే లోపు రాష్ట్రానికి తక్షణ సహాయం కింద రూ.10 వేల కోట్లు మోదీ ప్రకటించాలి. NDA ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు.. రాష్ట్రానికిది ఆపదకాలమని గుర్తించాలి. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం 2.88 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగినట్లు తక్కువ చేసి చెప్పడం సరైంది కాదు. ఇది రైతులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసమే’ అని షర్మిల అన్నారు.
Also Read: Pawan Kalyan: ఏపీలో భారీగా పంట నష్టం.. పొలంబాట పట్టిన పవన్ కళ్యాణ్.. రైతన్నల కష్టంపై ఆరా!
‘ప్రతీ కుటుంబాన్ని ఆదుకోవాలి’
మెుంథా తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు వెన్నుముకగా నిలవాల్సిన సమయం ఇదని షర్మిల అన్నారు. ‘పంటలతో పాటు ఆస్తి నష్టం అధికమే. సర్వం కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. మోదీ మోసాలు చూస్తూ ఇన్నాళ్లు మోకరిల్లిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడైనా నోరు విప్పాలి. జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయండి. జరిగిన నష్టానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం తీసుకురండి. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోండి’ అని షర్మిల పట్టుబట్టారు.
బీజేపీ @BJP4India పాలిత రాష్ట్రాల్లో ఉత్తరాదిన ప్రకృతి విలయాలకు వెంటనే జాతీయ విపత్తులుగా ప్రకటించుకునే ప్రధాని మోడీ @narendramodi గారు.. రాష్ట్రంపై మాత్రం మళ్లీ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు. మొంథా తుఫాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారు.…
— YS Sharmila (@realyssharmila) October 30, 2025
