Chandrababu: రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పర్యటనలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి ఈ అరాచకాలు ఏంటి? మహిళలపై, పోలీసులపై రాళ్లు వేస్తారా? దాడులకు పాల్పడిన వాళ్లపై ఆధారాలు సేకరించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. పొగాకు రైతులకు గిట్టుబాట ధర విషయంలో పరామర్శ పేరుతో జగన్ చేసిన రాజకీయ యాత్రలో వైసీపీ శ్రేణులు దాడులకు దిగడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నిజంగానే బరువు తగ్గారా.. ఎందుకిన్ని డౌట్స్?
ప్రతిసారీ.. ఏంటిది?
‘ రైతుల పరామర్శకు వెళితే జిల్లా వ్యాప్తంగా జనసమీకరణ ఎందుకు? వెళ్లింది రైతుల కోసమా.. దాడుల కోసమా? నా ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలకు తావులేదు. ప్రజా సమస్యల పేరుతో జనంలోకి వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారు. ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే.. దాన్ని అలసత్వంగా భావిస్తున్నారా? దుర్వినియోగం చేస్తారా? జగన్ పర్యటనలు చూస్తుంటే తన ఉద్దేశం రైతుల సమస్యలు కాదు. అలజడి సృష్టించి ఉనికి చాటుకునే ప్రయత్నమేనని అర్థమవుతోంది. రాజకీయ అజెండాతో చేసే ఇలాంటి పోకడలను అంగీకరించేది లేదు. సమస్య ఉంటే నిరసనలు తెలపడానికి, పరామర్శకు వెళ్లడానికి అభ్యంతరం లేదు. ప్రభుత్వం ఎక్కడా అనుమతులు నిరాకరించడం లేదు. అయితే ప్రతి పర్యటనలో వాళ్లు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. శాంతి భద్రతల సమస్య సృష్టించి, రాళ్ల దాడి చేసి.. పోలీసులతో పాటు, పలువురు గాయపడడానికి కారణం అయిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోండి. వాళ్లు ఎక్కడికి వెళ్లాలి అంటే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నాం. అలా అని రాజకీయ ముసుగులో నేరాలు చేస్తాను అంటే మాత్రం సహించేది లేదు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలి’ పోలీసు ఉన్నతాధికారులకు సీఎం క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేశారు.
కనీసం క్షమాపణ చెప్పరా?
‘ జగన్ సొంత ఛానల్లో మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. ఆ వికృత వ్యాఖ్యలను, ప్రచారాన్ని అన్ని వర్గాలు ఖండించాయి. అయితే జగన్ మాత్రం ఇప్పటికీ వాటికి క్షమాపణ చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు నాయకులుగా చలామణి అవుతానంటే ఎలా? ప్రజలు ఎలా అంగీకరిస్తారు? ఆడబిడ్డలు ఆవేదనతో నిరసన చేస్తే వారిపై దాడులు చేస్తారా?’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే ఈ వ్యవహారంలో సాక్షి యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును (Kommineni Srinivasa Rao) అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. మరోవైపు ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును కూడా తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం ప్రాంతంలో కృష్ణంరాజును అదుపులోనికి తీసుకున్న పోలీసులు.. అక్కడ్నుంచి గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు. గురువారం మంగళగిరి కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు.
ఆర్గనైజ్డ్గా పొదిలిలో ఉద్రిక్తతలు..
జగన్ పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైసీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్గా వ్యవహారమని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అంబటి.. ‘ జగన్ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు మాత్రమే. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో జనం భారీగా తరలి వచ్చారు. నలుగురైదుగురు మహిళలను పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్ పర్యటనల్లో నిరసనలు జరిగేలా లోకేష్ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్లబెలూన్లు ఎగరేయడం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్ కాదా? జగన్ పర్యటనలు చేయకూడదా? మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా? పోలీస్ వ్యవస్థ టీడీపీ నాయకులకు అండగా ఉంది. వైసీపీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది ఆ వేధింపులు, బెదిరింపులు భరించలేక కొందరు బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ వైసీపీ కార్యకర్త. ఆయన్ని గత కొన్ని రోజులుగా సివిల్ మ్యాటర్లో పోలీసులు వేధిస్తున్నారు. లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి డీఎస్పీ బూతులు తిట్టారు. ఆ వేధింపులు భరించలేకనే ఆయన సెల్ఫీ వీడియో తీసి సూసైడ్కు ప్రయత్నించారు. ఆ వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారు. తూటాలు ఉపయోగించే పరిస్థితి కూడా రావొచ్చు’ అని అంబటి వ్యాఖ్యానించారు.
Read Also- Nikhil Movie: నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా సెట్లో భారీ ప్రమాదం