YS Jagan: వైసీపీ కంచుకోట, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇలాకాలో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పంథానికి వెళ్లి మరీ, కడప గడపలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కడప కంచుకోటను క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహిస్తున్నామని అగ్రనేతలు ప్రకటించారు కూడా. అయితే ఇంతవరకూ మహానాడుపై స్పందించని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి తీవ్రంగా స్పందించారు. అంతేకాదు ఈ సందర్భంగా పలు ఛాలెంజ్లు సైతం చేశారు. ‘ చంద్రబాబు మహానాడులో ఫోజులు కొడుతున్నారు. మహానాడు పేరుతో తెలుగు డ్రామా పార్టీ కడపజిల్లాలో కార్యక్రమం చేస్తున్నారు. హీరోయిజం అంటే కడప జిల్లాలో మహానాడు పెట్టడం కాదు. హీరోయిజం అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడం. అంతే తప్ప సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి, జగన్ను తిట్టడం హీరోయిజం ఎలా అవుతుంది? చంద్రబాబూ గుర్తుపెట్టుకో. మీ కార్యకర్తను ఇంటింటికీ తిప్పే సత్తా ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఇది వైసీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా’ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. బుధవారం కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైసీపీ కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు.
Read Also- Mahanadu 2025: టీడీపీలో కోవర్టులు.. స్వయంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు
బెదిరించి.. భయపెట్టి..
‘ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. వైసీపీ హయాంలో కోవిడ్ వచ్చినా వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా ఏరోజు కూడా వాటిని ఏనాడూ సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో అలాగే ఉన్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా, వారికి మనం మంచి చేశామని గుర్తు చేశారు. ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు. చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు. చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితి. గ్యాస్ సిలిండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్మెంట్ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియింబర్స్మెంట్, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి’ అని బాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also- YSRCP: ‘కుప్పం’ సాక్షిగా నారా లోకేష్ మోసం బట్టబయలు.. పెద్ద కథే ఉందిగా..
రిటర్న్ గిఫ్ట్లు ఇద్దాం?
‘ ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది. తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలూ సృష్టిస్తున్నారు. వైసీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవరిదో తెలుసు, చంపిన వాళ్లు ఎవరో కూడా తెలుసు. టీడీపీలో గ్రూపుల తగాదాలే దీనికి కారణమని స్వయంగా ఎస్పీ చెప్పారు. ఇప్పుడు మన పార్టీ ఇన్ఛార్జి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసులు పెట్టారు. ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే తప్పుడు కేసు, తప్పుడు సెక్షన్లు పెట్టి మాజీ మంత్రిని కాకాణిని అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై ఘటన విషయంలో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద కేసు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో అనేక దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతోంది. ఈ సారి 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తల బాగోగులను చూసుకుంటాం. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాం. ఎవరు అన్యాయం చేసినా, మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీ సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం. చేసినవాళ్లే కాదు, వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించిన వారిని కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్ అయినా సరే చట్టం ముందు కచ్చితంగా నిలబెడతాం. అన్యాయాలు చేయడానికి వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు చేయడానికి వీరికి యూనిఫాం ఇచ్చింది’ అని వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also- Tollywood: దిల్రాజుపై బాంబు పేల్చిన జనసేన బహిష్కృత నేత.. మొత్తం బండారం బయటపెట్టేశారుగా!