YS Jagan
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: ప్రధాని మోదీపై ప్రేమ అస్సలు తగ్గలేదుగా!

YS Jagan: అవును.. పాత పరిచయాలు అంత సులువుగా పోవని పెద్దలు చెబుతుంటారు కదా..! ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) విషయంలోనూ అదే జరుగుతోంది. ఎందుకంటే వైసీపీ (YSRCP) అధికారంలో ఉన్నప్పట్నుంచి ఇప్పటి వరకూ కేంద్రంలోని బీజేపీ, మోదీ-అమిత్ షాలపై ఎంత ప్రేమ ఒలకపోశారో.. ఇంకా ఒలకబోస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ప్రధాని మోదీని పల్లెత్తు మాట మాట్లాడానికి వైసీపీ అండ్ కో అస్సలు సాహసించట్లేదు. సమయం, సందర్భాన్ని పార్లమెంట్‌లో పలు బిల్లులకు మద్దతిస్తూ వస్తోంది పార్టీ. పైగా.. బీజేపీతో చేయి కలిపి ఉంటే గెలిచేవాళ్లమని, రానున్న ఎన్నికల్లో అయినా ఆలోచన చేయాలని మాజీలు.. అధినేతకు సలహా ఇస్తున్నారు కూడా. ఇక వైఎస్ జగన్ కూడా మోదీని, ఎన్డీఏ సర్కార్‌ను ఒక్కటంటే ఒక్క మాట కూడా అనట్లేదు. అంటే నరేంద్ర మోదీపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ సీఎం చంద్రబాబుపై ద్వేషం, అసూయను వైసీపీ ప్రదర్శిస్తోందని దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. జగన్ సైతం బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని మోదీని (Narendra Modi) ఆకాశానికెత్తుతూ.. చంద్రబాబుపై (Chandrababu) తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు స్ట్రాంగ్ వార్నింగ్‌లు కూడా ఇచ్చారు.

Read Also- Chandrababu: వైఎస్ జగన్‌ నుంచి గుణపాఠాలు నేర్చుకున్న చంద్రబాబు.. ఐదు విషయాలివే!

YS Jagan and Modi

అసలేం జరిగింది?
జ‌గ‌న్ ఇవాళ ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు సందర్శించి, అక్కడ పొగాకు రైతుల సమస్యలు ఆరా తీశారు. కనీస గిట్టుబాటు ధర కూడా రాక, సరుకు కొనేవారూ లేక పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రైతు రాజ్యం నడిచింది. ఇవాళ‌ కూటమి ప్రభుత్వంలో దోపిడీ రాజ్యం న‌డుస్తోంది. గ‌త ప్రభుత్వంలో ఖరీఫ్‌ సీజన్‌లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని మాటిచ్చిన చంద్రబాబు.. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు.. కానీ, చంద్రబాబు ఎగ్గొట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఇచ్చిన పెట్టుబడి సాయం చంద్రబాబు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్దమనిషి చంద్రబాబు, మోదీ ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మరో రూ.20 వేలు ఇస్తానని చెప్పి, గత ఏడాది మొత్తం ఎగరగొట్టారు. ఈ ఏడాది మోదీ ఇవ్వాల్సిన రూ.6 వేలు ఇచ్చేసినా, చంద్రబాబు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టే పరిస్థితుల మధ్య రాష్ట్రంలో వ్యవసాయం అధ్వానంగా సాగుతోంది అని మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

YS Jagan With Farmers

ఏడాదిలోనే ఇంత దారుణమా? రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఈ రోజు రైతులు పడుతున్న అవస్థలు ఎలా ఉన్నాయంటే.. రైతులను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సీజన్‌‌లోనే ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరుచూరులో ఒక రైతు, గడిచిన శుక్రవారం కొండేపిలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, కనీస మద్దతు ధర కంటే రూ.300 తక్కువ రైతులకు చెల్లించారు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, పెసలు, రాగులు, మొక్కజొన్న, కోకో, వేరుశనగ, చీనీ, పొగాకు ఇలా ఏ పంట తీసుకున్నా రైతన్నకు రాష్ట్రంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోంది. అదే ఏడాది క్రితం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు, రైతు పరిస్థితి ఎలా ఉండేది? ఒక్క సంవత్సరంలో అది ఏ విధంగా దిగజారిందని చెప్పడానికి జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలే నిదర్శనం. వైసీపీ ప్రభుత్వ హయంలో ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్‌ ముగిసే నాటికి ఇచ్చే సాంప్రదాయం ఉండేది. ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య వ్యవసాయం జరుగుతోంది. మా హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత, పంట నష్టపోతారన్న భయం లేకుండా, ప్రతి పంటకు రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి, ప్రతి ఎకరాను ఈ–క్రాప్‌ చేసి, ఆర్బీకేల ద్వారా ఉచిత పంటల బీమా అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసిన పరిస్థితి కనిపిస్తోంది అని కూటమి సర్కార్‌పై జగన్ మండిపడ్డారు.

YS Jagan Prakasam

నాడు.. నేడు!
ఈ–క్రాప్‌ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారు. దళారులు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ, రాష్ట్రంలోని 146 రూరల్‌ నియోజకవర్గాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, వాటన్నింటినీ అందుబాటులోకి తెచ్చి, రైతులకు గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉండే పరిస్థితిని వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేసి, మళ్లీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులకు అవకాశం కల్పించింది. ఇంకా గత మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, ఆర్బీకే వ్యవస్థ ద్వారానే దళారీ వ్యవస్థను తీసివేసి, రైతులకు కనీస మద్దతు ధర అందించే ప్రయత్నం చేయడంతో పాటు, ప్రతి రైతుకు జీఎల్‌టీ కింద గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా ఛార్జీలుగా ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చాం. అదే ఈరోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యాన్ని రూ.300 తక్కువకు కొనుగోలు చేసిన పరిస్థితి, రైతు దళారీలకు అమ్ముకున్న పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఐదేళ్ల కాలంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్‌లో పోటీ తత్వాన్ని తెచ్చి, రైతులను ఆదుకున్నాం. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టమాటో వంటి పంటలకు కూడా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించి, ఆర్బీకేలలో వాటిపై పోస్టర్లు ఏర్పాటు చేసి అక్కడే అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ను అక్కడే కూర్చోబెట్టి.. ప్రతి పంటా కూడా ఈ క్రాప్‌ చేసి.. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే.. అక్కడ సీఎం యాప్‌ అని పెట్టి.. వెంటనే ఆ పంటలకు సంబంధించిన రేట్లు అప్డేట్‌ చేసేవారు. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకుండా ఉంటే వెంటనే ప్రభుత్వం స్పందించేది అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.

Tobacco Farmers

జగన్ వస్తున్నాడని..
పొగాకు పంటనే తీసుకుంటే మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కూడా 2023–24లో కేజీ రూ.360 అంటే క్వింటా రూ.36 వేలకు వర్జీనియా పొగాకు అమ్ముడుపోయింది. లోగ్రేడ్‌ కూడా రూ.24 వేలకు తగ్గకుండా అమ్ముడుపోయిన పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఏమిటి అని మనమే వెళ్లి చూశాం. ఈరోజు జగన్‌ వస్తున్నాడని వీరంతా సిండికేట్‌ అయ్యి కాస్తో.. కూస్తో కొంత రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. జగన్‌ వస్తున్నాడు.. జగన్‌ ఎక్కడ మాట్లాడతాడో అల్లరవుతామేమో అని. మార్చిలో ప్రొక్యూర్‌మెంట్‌ మొదలుపెట్టి జూన్‌ నాటికి పూర్తి చేయాలి. ఈ ఏడాది 220 మిలియన్‌ టన్నుల ప్రొక్యూర్‌మెంట్‌ చేయాల్సి వుంటే కేవలం 40 మిలియన్‌ టన్నులు మాత్రమే చేశారు. ఈరోజు రేటెంత అని చూస్తే హైగ్రేడ్‌ బ్రైట్‌ క్వాలిటీ రేటు సగటున కేవలం రూ.220 నుంచి రూ.260 మధ్యలో అమ్ముడుపోతున్న పరిస్థితి. హైగ్రేడ్‌ క్వాలిటీ రూ.240కి కూడా రాని పరిస్థితి నెలకొంది. నేను వచ్చాను కాబట్టి ఈరోజు రూ.280కు కొన్నారు. లోగ్రేడ్‌ చూస్తే కొనే నాథుడే లేడు. దాన్ని రూ.160 నుంచి రూ.180కి కొంటున్నారు. అది కూడా ధర నచ్చక రైతులు నలభై శాతం స్టాట్‌ వెనక్కి తీసుకెళ్తున్న పరిస్థితి. అదే మా ప్రభుత్వ హయాంలో ఇదే హైగ్రేడ్‌ క్వాలిటీ కేజీ రూ.366కు అమ్ముడు పోయింది. అంటే క్వింటా రూ.36 వేలకు కొన్నారు. జూన్‌ నెల సగానికి వచ్చి సీజన్‌ అయిపోతున్నా 220 మిలియన్‌ టన్నులు కొనాల్సి ఉంటే కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్‌ టన్నులు మాత్రమే. పక్కనే ఉన్న కర్నాటకలో కేజీ రూ.360 లకు కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్‌ రేటు రూ.200 కూడా దక్కడం లేదంటే రైతులు ఎంత దయనీయ పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్‌ బర్లీ పొగాకు చూస్తే గతేడాది మా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు అమ్ముడుపోతే, ఈరోజు పరిస్థితి చూస్తే రూ.6 వేల నుంచి రూ.9 వేలు దాటడం లేదు. దీంతో పొగాకు రైతు ఎకరాకు రూ.80 వేలు నష్టపోతున్న పరిస్థితి. ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించకపోతే, పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టకపోతే, మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి పోటీతత్వం పెంచి ప్రతి రైతుకు కనీసం యావరేజ్‌ ప్రైజ్‌ వచ్చేలా చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం అని ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ హెచ్చరించారు.

YS Jagan

Read Also- Chandrababu: సీఎం చంద్రబాబు తియ్యటి శుభవార్త.. రెండ్రోజుల్లో డబ్బులే డబ్బులు!

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?