Singayya Incident: వైసీపీ కార్యకర్త సింగయ్య మరణంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్లోని కారు ఢీకొని చనిపోయారా..? లేదంటే జగన్ కారే ఢీకొని మరణించారా? అనేదానిపై క్లారిటీ రాలేదు కానీ, వీడియోలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు. వైసీపీ గురించి ఇసుమంత పాయింట్ దొరికితేనే ఓ రేంజిలో ఆటాడుకునే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు.. ఎందుకో సైలెంట్గా ఉండటంతో వీడియోపై లేనిపోని అనుమానాలు వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఫ్యాన్ పార్టీ నేతలు అసలేం జరిగిందనే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చుకుంటున్నారు. మరోవైపు సింగయ్య మరణించిన ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇంతకీ ఎవరేం మాట్లాడారు? ఎవరి రియాక్షన్ ఎలా ఉంది? అనేది చూద్దాం..
Read Also- USA Advisory: ఉత్తర తెలంగాణ వెళ్లొద్దు… అమెరికా సంచలన అడ్వైజరీ
Read Also- YS Jagan: ఏ2గా వైఎస్ జగన్.. త్వరలోనే అరెస్ట్?
అన్నా.. ఏంటిది?
ఎక్స్ వేదికగా తన సోదరుడు వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేలాదిమంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ చేతులూపడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ? బెట్టింగ్లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలిస్తారా? ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాక్షస ఆనందం? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా? కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? ఇది పూర్తిగా జగన్ బాధ్యత రాహిత్యాన్ని అద్దం పడుతుంది. బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్, 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పర్మిషన్కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు? ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్ర పుచ్చారు? ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్టులు చేస్తారు. దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం ఇస్తారు? కూటమి ప్రభుత్వం, టీడీపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీలు ఏం సమాధానం చెబుతాయి? ఏం చర్యలు తీసుకుంటున్నారు?’ అని ఎక్స్ వేదికగా షర్మిల ప్రశ్నించారు.
ఎందుకీ క్షుద్ర రాజకీయాలు..?
కొన్ని మీడియా సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు.. చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్దపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే, ఆ మరణంపై ఏ మాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాతలతో వైసీపీపై విషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ దురదృష్టవశాత్తు వెంగళాయపాలేనికి చెందిన సింగయ్య అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోగా, సత్తెనపల్లిలో జయవర్ధన్రెడ్డి అనే యువకుడు వడదెబ్బ కారణంగా గుండెపోటుకు గురై మృతిచెందారు. ఇందులో ఎక్కడా జగన్ వాహనం కానీ, ఆయన కాన్వాయ్ వాహనాలు కానీ, సింగయ్యను ఢీకొట్టలేదని ఎస్పీ స్వయంగా వెల్లడించారు. కాన్వాయ్కి ముందు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన ప్రమాదానికి గురైనట్టు ఎస్పీ కూడా ధ్రువీకరించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. జగన్ పర్యటన కోసం సింగయ్యతోపాటు మరో 40 మందిని మా పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బాలసాని కిరణ్ కుమార్ తీసుకొచ్చినట్టుగా రాసిన స్టేట్మెంట్ మీద సంతకం పెట్టమని సింగయ్య మృతదేహానికి పోస్టుమార్టం సమయంలో ఆయన భార్యను పోలీసులు ఒత్తిడి చేశారు. పోలీసులు రాసి తీసుకొచ్చిన తప్పుడు స్టేట్మెంట్పై ఆ సమయంలో అక్కడే ఉన్న పార్టీ నాయకులమంతా అడ్డం తిరగడంతో పోలీసులు సింగయ్య భార్య, ఆమె బంధువులు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వెళ్లిపోయారు. లేదంటే దీన్ని హత్యకేసుగా చిత్రీకరించి ఎవరో ఒకర్ని ఇరికించాలన్న కుట్ర అప్పుడే జరిగింది’ అని అంబటి ఆరోపించారు.
అస్సలు ఊరుకోరు..
‘ వాస్తవానికి జగన్ తన వాహనమే కాదు, ఆయన కళ్లముందు ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ఆస్పత్రి చేర్చేవరకూ ఊరుకోరు. అలాంటిది జగనే స్వయంగా కారేసుకెళ్లి సింగయ్యను గుద్ది చంపారు అన్నంతలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికో ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని జగన్, మా కార్యకర్త సింగయ్య చనిపోతే ఎలా వదిలేస్తారని అనుకున్నారు? ఆయన కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. ఇప్పటికే వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.10 లక్షల చెక్కును పార్టీ తరఫున వారి కుటుంబానికి అందజేయడం కూడా జరిగింది. జగన్ పర్యటన విజయవంతం కావడంతో ఓర్వలేక క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ఎప్పటికీ బయటకు రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం తప్పుడు కథనాలు రాయించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సత్తెనపల్లి పర్యటన విజయవంతం కావడంతో దాని మీద ఇప్పటికే మా నాయకులు గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కేసులు పెట్టారు. నాకు కూడా నిన్న రాత్రి నోటీసులు ఇచ్చి వెళ్లారు. చంద్రబాబుని జైల్లో పెట్టామనే కక్షతో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, నాయకులందర్నీ లోకేష్ జైళ్లకు పంపుతున్నారు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు’ అని అంబటి రాంబాబు వెల్లడించారు.
Read Also- YSRCP: సింగయ్య నిజంగానే జగన్ కారు కిందపడి చనిపోయాడా.. వీడియోపై బోలెడన్ని డౌట్స్!