Vallabhaneni Vamsi: వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. బుధవారం సాయంత్రం విజయవాడ జిల్లా జైలు (Vijayawada Jail) నుంచి వంశీ విడుదలయ్యారు. ఇప్పటి వరకూ ఆయనపై ఉన్న అన్ని కేసుల్లోనూ బెయిల్ ముంజూరు కాగా, తాజాగా ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. దీంతో ఆయన రిలీజ్కు మార్గం సుగుమమైంది. కూటమి ప్రభుత్వం వంశీపై 11 కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒకటి తర్వాత మరొకటి.. బెయిల్ రావడంతో, ఇంకో కేసు నమోదు కావడం సరిపోయింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్లో (Hyderabad) అరెస్ట్ చేయడం జరిగింది. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వంశీ తన అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. బుధవారం విజయవాడ సబ్ జైల్ నుంచి విడుదలయ్యారు. కాగా, వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ (Panakaja Sri), వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని (Perni Nani), ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు పార్టీ శ్రేణులు, వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకుని స్వాగతం పలికారు.
Read Also- Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. రాజకీయాలకు గుడ్ బై?
సర్కార్కు ఎదురుదెబ్బ!
వాస్తవానికి వంశీని జైలులో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. ఆయనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చినప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టులను ప్రభుత్వం ఆశ్రయించడం గమనార్హం. దీంతో వల్లభనేనిపై సర్కార్ ఇంతగా పగబట్టిందేంటి? అని సర్వత్రా చర్చించుకుంటున్న పరిస్థితి. మంగళవారం నాడు వంశీకి బెయిల్ రాగా.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో వంశీకి ధర్మాసనంలో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. అనంతరం, తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ఆసక్తి చూపించలేదు. మైనింగ్ వాల్యూయేషన్పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
Read Also- Vallabhaneni Vamsi Health: వంశీకి మళ్లీ సీరియస్.. పోలీస్ స్టేషన్లో వాంతులు.. ఆందోళనలో ఫ్యామిలీ!
తర్వాతేంటి?
వాస్తవానికి.. మాస్ అంతకుమించి రెబల్ లీడర్గా ఉన్న వంశీ.. అరెస్ట్ తర్వాత పూర్తిగా మారిపోయారు. ఎంతలా అంటే ఆ ఫొటోలు, వీడియోలను చూస్తే వంశీనేనా? అనే సందేహాలు అందరిలోనూ వస్తాయి. ఆరోగ్యం సహకరించకపోవడం, పదే పదే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బెయిల్ పైన బయటికొచ్చిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా వంశీ అత్యంత ఆత్మీయులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే చర్చ గన్నవరం, కృష్ణా జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఏం మాట్లాడినా మళ్లీ ఏదో ఒక కేసు, హడావుడి అంతా ఎందుకు? అయినా వైసీపీలో ఉన్నా, ఒకవేళ పార్టీ మారినా ఎలాంటి ప్రయోజనాలు ఉండవన్నది వంశీ మనసులోని మాటని తెలిసింది. ఆ మధ్యనే ములాఖత్లో తన భార్య పంకజ శ్రీతో కూడా ‘రాజకీయ సన్యాసం’పై చర్చించినట్లుగా తెలుస్తున్నది. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ వ్యాపారాలు ఉన్నాయి. దీంతో వ్యాపారాలు మాత్రమే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత బయటికి రాగానే రాజకీయాలకు గుడ్ బై అనే ప్రకటన ఉంటుందని భోగట్టా. మరోవైపు వంశీ భార్య రాజకీయ అరంగేట్రం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. వంశీ జైలుకెళ్లిన తర్వాత వైసీపీ అండగానే నిలిచింది. నేరుగా వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కూడా జైలుకెళ్లి పరామర్శించారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటారా? లేదా వైసీపీలో కొనసాగుతారా? అనేది చూడాలి మరి.
Read Also- Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని వంశీ గుడ్ బై.. రంగంలోకి మేడమ్!