Tirumala Darshan Tickets: దేశంలోని ప్రముఖ సుప్రసిద్ధ దేవాలయాల్లో తిరుమల ఒకటి. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రపంచ నలుమూల నుంచి వచ్చి స్వామి వారి మెుక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో భక్తుల కోసం టీటీడీ ప్రతి నెలా ఆన్ లైన్ లో ఆర్జిత సేవ, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో నేటి నుంచి విడుదల చేయబోతోంది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
లక్కీడిప్లో టికెట్లు
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను ఇవాళ (జూన్ 18) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను జూన్ 21న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ భక్తులకు కేటాయించనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూన్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Also Read: BJP party: గ్రౌండ్ లెవల్లో పార్టీ బలోపేతం కోసం అడుగులు.. సక్సెస్ అయ్యేనా!
గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. 25న శ్రీవారి సేవా ఆగస్టు నెల కోటా టికెట్లు అందుబాటులోకి రానుంది. శ్రీవారి సేవ (తిరుమల మరియు తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల ఆగస్టు నెల కోటాను జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.