Nagababu vs Varma: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నియోజకవర్గమైన పిఠాపురం (Pithapuram)లో ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు (MLC Nagababu) పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం నాగబాబు పిఠాపురంలోనే ఉన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన నాగబాబు.. ఇవాళ కూడా మరికొన్ని పనుల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే నాగబాబుకు టీడీపీ శ్రేణుల నుంచి ఊహించని షాక్ తలిగింది. వర్మ (S. V. S. N. Varma) అనుచరులు నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read: Hyderabad City: మందుబాబులకు బిక్ షాక్.. రేపు వైన్స్ బంద్.. ఎందుకంటే?
టీడీపీ వర్సెస్ జనసేన
రెండో రోజు పర్యటనలో భాగంగా పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో సి.సి రోడ్డును ప్రారంభించేందుకు నాగబాబు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. వర్మ వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు.. జై వర్మ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు సైతం తమ బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం ఈ ఘటన కూటమి ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తొలిరోజూ ఉద్రిక్తతే
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు శుక్రవారం కూడా పర్యటించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాగబాబు శ్రీకారం చుట్టారు. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి.. పలువురికి భోజనం వడ్డించారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు (వర్మ అనుకూల వర్గం) నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పుడు కూడా జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు పోటీగా జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశారు.
పర్యటనకు దూరంగా వర్మ
మరోవైపు నాగబాబు (MLC Nagababu) మూడ్రోజుల పర్యటనకు స్థానిక టీడీపీ నేత వర్మ దూరంగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇటీవల పార్టీ ఆవిర్భావ సభలో పవన్ గెలుపునకు ఎవరూ కారణం కాదని నాగబాబు ప్రకటించడంతో ఆయన అసహనానికి గురయ్యారని తెలుస్తోంది. దీనికి తోడు పవన్ లేని సమయంలో పిఠాపురం ఇంఛార్జీగా నాగబాబు బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారంతో ఆయన కోపం మరింత ఎక్కువైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విషయంలో ఆయన అనుచరులు సైతం కోపంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాగబాబు పర్యటన సందర్భంగా వారంతా వర్మకు అనుకూలంగా నినాదాలు చేసినట్లు స్పష్టమవుతోంది.
వైసీపీలో చేరతారా?
ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మకు అటు టీడీపీలో గానీ.. ఇటు జనసేనలో గానీ సముచిత స్థానం దక్కడం లేదని ఆయన అనుచరులు కోపంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వర్మ.. త్వరలో వైసీపీలో చేరతారన్న ప్రచారం పెద్ద ఎత్తున మెుదలైంది. వైసీపీ సోషల్ మీడియా (YCP Social Media).. వర్మ రాకను ముందుగానే ఖరారు చేసేస్తోంది. అయితే జోరుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని వర్మ గానీ, అతడి అనుచర వర్గం గానీ ఖండించడం లేదు. దీంతో వైసీపీలోకి ఆయన వెళ్లడం ఖాయమేనన్న సందేహాలు ఏపీ రాజకీయాల్లో వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే పిఠాపురం నుంచి వంగా గీతను తప్పించి.. వర్మకు వైసీపీ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.