Pithapuram: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మళ్లీ యాక్టివ్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎలాంటి పదవులు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనికి తోడు పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్తో వర్మ, ఆయన అనుచరులు, అభిమానులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. నాటి నుంచి కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఫేస్బుక్లో రెండు మూడ్రోజులుగా వరుసగా ఆసక్తికర పోస్టులు పెడుతూ వస్తున్నారు.
‘ ప్రజలే నా బలం’ అంటూ వర్మ పెట్టిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించింది జనసైనికులే. మేమే అని ఎవరైనా అనుకుంటే వాళ్ల ఖర్మే’ అంటూ ఆవిర్భావ సభలో మెగా బ్రదర్ చేసిన కామెంట్స్కు ఇలా పరోక్షంగా వర్మ కౌంటర్లు ఇస్తున్నారని పిఠాపురంలో చర్చ జరుగుతోంది. మరోవైపు అనుచరులు, అభిమానులు ఎక్కడా అసంతృప్తి లోనుకాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపుతూనే ఉన్నారు. ఎవ్వరూ టీడీపీ, జనసేన పార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని వర్మ సూచిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వరుసగా పోస్టులు పెడుతుండటంతో ఏదో తేడా కొడుతోందే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కార్యకర్తే అధినేత!
మరోవైపు కార్యకర్తే అధినేత అంటూ తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లుగా రగిలిన అసంతృప్తిని పక్కనెట్టి ఇప్పుడిక ప్రజాక్షేత్రంలోకి రావాలని వర్మ నిర్ణయించారు. ప్రతి బుధవారం, ప్రతి నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి సమావేశం అవుతున్నారు. అంతేకాదు నియోజవకర్గంలో పలువురి ఇళ్లకు వెళ్లి స్వయంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందజేస్తున్నారు వర్మ.
Also Read: Good News to Muslims: ముస్లింలకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం..
తన పని తాను చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకసారి పదవి రాకుండా పోతుందా? అని ముందుకెళ్తున్నట్లుగా వర్మ అనుచరులు స్థానికంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు త్వరలోనే రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదనే పుకార్లు కూడా పిఠాపురంలో షికార్లు చేస్తున్నాయి. ఇది మిస్సయితే మాత్రం 2027లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నట్లుగా ఇప్పటికే హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ వర్మకు వెళ్లిందని తెలుస్తున్నది.