Good News to Muslims: పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ విందు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆదివారం రూ.1.50 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కే హర్షవర్ధన్ ఉత్తరులు జారీ చేశారు. ముస్లిం మైనార్టీలకు అత్యంత భక్తిశ్రద్ధలతో కూడిన రంజాన్ మాసంలో సాయంకాలం ఉపవాస విరమణ సమయంలో భాగంగా ఈ నెల 27న రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలోని ఎంజీ రోడ్డులో ఉన్న ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు రానున్న 4, 5 రోజులలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని అనువైన రోజున నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇఫ్తార్ను జిల్లాస్థాయిలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా నిర్వహించాలని మైనార్టీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కే. హర్షవర్ధన్ పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి ఇఫ్తార్కు రూ.75 లక్షలు
విజయవాడ ఎంజీ రోడ్డు ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేయబోతున్న రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రూ.75 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. మిగతా మొత్తాన్ని జిల్లాల వారీగా కేటాయించి ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాస్థాయిలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలలో ముస్లిం మైనారిటీల జనాభా ప్రాతిపదికన ఇఫ్తార్ విందు కోసం నిధుల కేటాయించారు.
శ్రీకాకుళం జిల్లాకు రూ. 1.50 లక్షలు, విజయనగరం జిల్లాకు రూ.1.50 లక్షలు, మన్యం జిల్లాకు రూ.1 లక్ష, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.1 లక్ష, విశాఖపట్నం జిల్లాకు రూ.3 లక్షలు, అనకాపల్లి జిల్లాకు రూ.2 లక్షలు, కాకినాడ జిల్లాకు రూ.3 లక్షలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రూ.3 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాకు రూ.3 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాకు రూ.3 లక్షలు, ఏలూరు జిల్లాకు రూ.3 లక్షలు, కృష్ణా జిల్లాకు రూ.3 లక్షలు, గుంటూరు జిల్లాకు రూ.4 లక్షలు, బాపట్ల జిల్లాకు రూ.3 లక్షలు, పల్నాడు జిల్లాకు రూ.3 లక్షలు, ప్రకాశం జిల్లాకు రూ.3 లక్షలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రూ.5 లక్షలు, కర్నూల్ జిల్లాకు రూ.4 లక్షలు, నంద్యాల జిల్లాకు రూ.5 లక్షలు, అనంతపురం జిల్లాకు రూ.3.50 లక్షలు, శ్రీ సత్య సాయి జిల్లాకు రూ.3 లక్షలు, వైఎస్ఆర్ కడప జిల్లాకు రూ.3.50 లక్షలు, అన్నమయ్య జిల్లాకు రూ.4 లక్షలు, చిత్తూరు జిల్లాకు రూ.3 లక్షలు, శ్రీ బాలాజీ జిల్లాకు రూ.3 లక్షలు చొప్పున ఇఫ్తార్ నిర్వహణకు నిధులు కేటాయిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.