Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆయన భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) మతాన్ని తీసుకొస్తూ పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. సనాతనంపై అంత ప్రేమ ఉన్న వారైతే పరాయి మతస్తురాలను ఎందుకు పెళ్లి చేసుకున్నారంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఆయన సనాతనం గురించి మాట్లాడినప్పుడల్లా ఇదే అంశాన్ని నెట్టింట వైరల్ చేస్తూ చర్చకు దారితీస్తున్నారు. ఈ క్రమంలో భార్యతో కలిసి పవన్ తిరుమల (Tirumala Tirupathi Devasthanam) బాట పట్టడం ఆసక్తికరంగా మారింది.
తిరుమల ఎందుకంటే!
పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా కుమారుడైన మార్క్ శంకర్ (Mark Shankar Pawanovich).. ఇటీవల సింగపూర్ (Singapore)లో అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదం నుంచి పవన్ కుమారుడు.. స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో సింగపూర్ వెళ్లిన పవన్.. భార్య, కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. తన బిడ్డను పెనుగండం నుంచి బయటపడేసినందుకు కృతజ్ఞతగా భార్య, బిడ్డతో కలిసి ఆయన శ్రీవారి దర్శనం చేసుకోబోతున్నారు. ఇవాళ తిరుమలకు వెళ్లనున్న పవన్.. భార్య, కుమారుడితో కలిసి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు.
విమర్శకులకు చెంపపెట్టు
అయితే తొలి నుంచి అన్నా లెజినోవా గురించి ప్రస్తావిస్తూ పవన్ ను ఇరుకున పెట్టాలని భావించే వారికి ఈ తిరుమల పర్యటన చెంపపెట్టు లాంటిదని జనసేన వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి విదేశీ మహిళ అయిన పవన్ భార్య అన్నా లెజినోవా.. వివాహం అనంతరం భారత స్త్రీగా మారిపోయారు. హిందూ సంప్రదాయాలను పాటిస్తూ అందరీ ప్రశంసలు అందుకుంటున్నారు. అప్పట్లో పవన్ చేపట్టిన వారాహీ యాత్ర సందర్భంగా భర్తకు హారతి పట్టి అచ్చమైన తెలుగు మహిళగా కీర్తింపపడ్డారు. ఇటీవల పవన్ తో పాటు మహా కుంభమేళాలో పాల్గొని గంగమ్మ తల్లికి హారతి ఇచ్చారు. ఇప్పుడు తాజాగా తిరుమల శ్రీవారిని పట్టు వస్త్రాలతో దర్శించుకునేందుకు ఆమె సిద్ధం కావడం.. విమర్శకులకు మింగుడు పడటం లేదు.
Also Read: Gold Rate Today : బంగారం ప్రియులకు అలర్ట్.. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
ఎయిర్ పోర్ట్ దృశ్యాలు వైరల్
అగ్ని ప్రమాదంలో గాయపడ్డ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో పవన్ దంపతులు దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్కలేటర్ పై తన బిడ్డ మార్క్ శంకర్ ను ఎత్తుకొని పవన్ నిల్చొని ఉన్న వీడియో ఆసక్తిరేపుతోంది. కొద్దిసేపటి తర్వాత మార్క్ శంకర్ ను పవన్ భార్య అన్నా లెజినోవా తన చేతుల్లోకి తీసుకోవడం కూడా వీడియో కనిపిస్తోంది.