Roja vs TDP: వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. టీటీడీ పట్టు వస్త్రాల స్కామ్ ను తమ పార్టీకి రోజా ఆపాదించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ శ్రీశైలం బోర్డు ఛైర్మన్ చక్రపాణి రెడ్డి, జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, ఎంపీపీలు లక్ష్మీపతి రాజు, భాస్కర్ రెడ్డి నగరిలో మీడియా సమావేశం నిర్వహించారు. రోజాకు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ పార్టీ అని దుయ్యబట్టారు.
‘రోజా ఫ్రస్టేషన్లో ఉన్నారు’
శ్రీశైలం బోర్డ్ మాజీ ఛైర్మన్ చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ తాము పెట్టిన బిక్ష రోజా రాజకీయ జీవితమని మండిపడ్డారు. నగరి చరిత్రలో అత్యంత దారుణంగా ఓడిపోయిన నేత రోజానేనని విమర్శించారు. భవిష్యత్తులోనూ రోజా విజయం సాధించలేరని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. మరోవైపు జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రోజా ఫ్రస్టేషన్ తో టీడీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము పార్టీలు మారే వాళ్లం కాదన్న ఆయన.. రోజానే 2004లో నగరిలో, 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. తర్వాత మా పార్టీ మారి తమ దయతో ఎమ్మెల్యే అయ్యావని ఆరోపించారు.
‘నోరుంది కదా అని మాట్లాడొద్దు’
2014 ముందు మీ అర్థిక పరిస్థితి ఏమిటీ? ఇప్పుడు అర్థిక పరిస్థితి ఏమిటీ? అని రోజాను జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రోజా, ఆమె కుటుంబం నగరిని దోపిడి చేసిందని ఆరోపించారు. తాము పార్టీ మారడానికి కారణమే రోజా అని విమర్శించారు. నోరుంది కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. రోజాకు సత్తా ఉంటే నగరిలో రోజా గెలవాలని సవాలు విసిరారు. మీ నోటి దురుసు వల్లే వైసీపీ పార్టీకి ఈ గతి పట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా రోజా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేతలు రోజాకు సూచించారు.
రోజా ఏమన్నారంటే?
అంతకుముందు రోజా టీటీడీ పట్టు వస్త్రాల స్కామ్ గురించి రోజా మాట్లాడారు. తెలుగు దేశం పార్టీలో ఉన్న 2015లో జరిగిన ఘటనను మాజీ సీఎం జగన్ కు ఆపాదించడం సరికాదని అన్నారు. టీటీడీకి పట్టు వస్త్రాలు సరఫరా చేసిన నగరి కాంట్రాక్టర్ రాజా.. తెలుగు పార్టీకి చెందిన వ్యక్తి అని రోజా ఆరోపించారు. గతంలో ముద్దు కృష్ణమనాయుడుతో ఆయన ఉన్నారని.. ఇప్పుడు ఆయన కుమారుడు భాను ప్రకాష్ తో నగిరిలో దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ రాజా అనే వ్యక్తి 2010-15 మధ్య టీటీడీకి పట్టు వస్త్రాలు సరఫరా చేసినట్లు విచారణ నివేదికలోనూ స్పష్టంగా ఉన్నట్లు రోజా పేర్కొన్నారు.
Also Read: Viral video: రైలులో భయానకం.. బోగిలో ఒంటరి మహిళ.. 40 మంది కుర్రాళ్లు గుంపుగా వచ్చి..
టీటీడీ పట్టు వస్త్రాల స్కామ్!
తిరుమలలో ఇటీవల మరో భారీ మోసం వెలుగుచూసింది. శ్రీవారి సన్నిధిలో గత పదేళ్లుగా జరుగుతున్న ఘోరమైన అవినీతి బట్టబయలు అయ్యింది. నగరికి చెందిన వీఆర్ఎస్ ఎక్స్ పోర్ట్ (VRS Export) సంస్థ పట్టు పేరుతో పాలిస్టర్ శాలువలను సరఫరా చేసిన ఉదంతం బయటపడింది. ఏళ్ల తరబడి జరుగుతున్న మోసంపై ఏసీబీ విచారణకు సైతం టీటీడీ ఆదేశించింది. గత పదేళ్ల కాలంలో రూ.54 కోట్ల మేర శాలువ కొనుగోళ్లు జరిగినట్లు టీటీడీ విజిలెన్స్ నివేదిక పేర్కొంది. ఇటీవల జరిపిన ధర్మవరం, సిల్క్ బోర్డుల నాణ్యత పరీక్షలో టీటీడీకి సప్లయి అవుతున్న శాలువాలు విఫలమయ్యాయని అధికారులు తెలిపారు.

