Crime News: కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ.. షార్ట్ కట్లో కేఎల్ యూనివర్సిటీ. గుంటూరు జిల్లా తాడేపల్లికి దగ్గరలో ఉంటుంది. చైర్మన్ కోనేరు సత్యనారాయణ. తరచూ ఏదో ఒక వివాదంలో ఈ వర్సిటీ పేరు మార్మోగుతూనే ఉంటుంది. తాజాగా విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, సిబ్బంది వేధింపులే కారణంగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయం చుట్టూ అనేక వివాదాలు అల్లుకుని ఉన్నాయి.
హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య
కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేశ్ రెడ్డి అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాపట్ల జిల్లాకు చెందిన ఇతని మృతికి కేఎల్ యూనివర్సిటీ సిబ్బంది వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే వర్సిటీ యాజమాన్యం మృతదేహాన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి సమాచారం మేరకు కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు విచారణ ప్రారంభించారు. విషయం తెలిసి విద్యార్థి సంఘాలు వర్సిటీ దగ్గరకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు.
Also Read: Crime News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. యువతి ప్రేమ కోసం ఇద్దరు యువకులు నడిరోడ్డుపై కత్తులతో దాడి..?
వివాదాలు కొత్తేంకాదు
కేఎల్ యూనివర్సిటీకి వివాదాలు కొత్తేం కాదు. గతంలో విశ్వవిద్యాలయానికి ఏ++ గుర్తింపు కోసం న్యాక్ బృందానికి లంచాలు ఆశ చూపింది. దీనికి సంబంధించి సీబీఐ కేసు కూడా నమోదైంది. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, న్యాక్ సభ్యులపైనా కేసు బుక్ అయింది. మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో కేఎల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ సత్యనారాయణ పేరు కూడా ఉన్నది. నిందితుల్లో 10 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఇక, సత్యనారాయణ చుట్టూ భూ వివాదాలు కూడా ఉన్నాయి. 2020లో తన భూమి కబ్జా చేశాడని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో రమేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
మామ నాగలింగేశ్వర రావుపై కేసు
సత్యనారాయణతోపాటు అతని మామ నాగలింగేశ్వర రావుపై కేసు నమోదైనట్టు సమాచారం. అలాగే, హైదరాబాద్ గాజులరామారంలోని సర్వే నెంబర్ 419, 420లోని 12 వందల గజాల స్థలం విషయంలోనూ కేఎల్ యూనివర్సిటీ పేరు గతంలో మార్మోగింది. స్థలంలో కంటైనర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారిని, కేఎల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది సిబ్బంది కత్తులతో బెదిరించి క్యాంపస్ ఆవరణలో నిర్బంధించినట్టు అప్పట్లో బాధితులు వాపోయారు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యతో మరోసారి కేఎల్ యూనివర్సిటీ వార్తల్లోకి ఎక్కింది. గతంలో జరిగిన వివాదాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
Also Read: Crime News: కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ఐదుగురు మృతి
