Andhra Pradesh: చంద్రబాబు నేతృత్వంలో ఏడాది కిందట సరిగ్గా ఇదేరోజు ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన పాలనతో ప్రజలకు చీకటి రోజులను మిగిల్చిందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏడాది పాలనతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ ప్రచురించిన పుస్తకాన్ని పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఒక అరాచకాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్ పాలన అంటే నమ్మకం గుర్తుకు వస్తే, ఇప్పుడు చంద్రబాబు కూటమి పాలనలో ప్రజలకు పొడిచిన వెన్నుపోటే గుర్తుకొస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంగా వ్యవస్థల నిర్వీర్యం నుంచి ప్రజాస్వామ్య విధ్వంసం వరకు ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగిందని అన్నారు.
Read Also- Thalliki Vandanam: తల్లికి వందనం పథకంలో రూ.2వేలు ఎగనామం.. ఎందుకనీ?
ఆధారాలతో సహా..
‘ ఏడాది కిందట ఈ రోజు చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. 2019-24 మధ్య ఒంటరిగా వైసీపీ పోటీ చేసి 151 సీట్ల భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024లో మూడు పార్టీల కుటమితో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సాధారణంగానే జగన్ ఏడాది పాలనను, చంద్రబాబు కూటమి ఏడాది పాలనను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల పలితాలు వెలువడిన జూన్ 4న ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు కూటమి పాలనపై వైసీపీ వెన్నుపోటు దినంగా ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేయడం, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు బనాయించడం, అడ్డగోలుగా అవినీతికి పాల్పడటం చేశారు. దానికి ఉదాహరణలను సవివరంగా వివరిస్తూ, ఫోటోలతో సహా వైసీపీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. దానిని ఈ రోజు ఆవిష్కరిస్తున్నాం. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అంటూ ఐదు కోట్ల ఏపీ ప్రజలకు ఎలా వెన్నుపోటు పొడిచారో ఈ పుస్తకం ద్వారా వెల్లడిస్తున్నాం. అన్ని ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని వెలువరించాం’ అని సజ్జల వెల్లడించారు.
Read Also- DD Next Level: ఓటీటీలోకి వచ్చేస్తున్న దడ పుట్టించే కామెడీ సినిమా.. ఎందులో అంటే?
బంగారు భవిష్యత్తుకు పునాదులు..
‘ గతంలో వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రానికి, ప్రజలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఎలా పునాదులు వేసి, ముందుకు తీసుకువెళ్ళారో ఈ పుస్తకంలో ఉంది. అలాగే నేడు చంద్రబాబు ఆ పాలనను ఎలా విధ్వంసం చేసి, రాష్ట్రాన్ని చీకటి రోజుల వైపు ఎలా నడిపించారో కూడా సవివరంగా పొందుపరచడం జరిగింది. జగన్ (YS Jagan) ఐదేళ్ళ పాలనలో కొత్త వ్యవస్థలు, యువత భవిష్యత్తుకు పునాదులు, నాలుగు పోర్ట్లు, పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇలా పాతికేళ్ళలో చేయలేని దానిని కేవలం అయిదేళ్ళలో శ్రీకారం చుట్టిన ఘనత కనిపిస్తుంది. 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ఏడాదిలోనే, టీచర్ల నియామకాల్లో గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించి నియామకాలను పూర్తి చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల్లో ప్రగతిపథమైన పాలన జరిగింది. ఏడాది చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా నడిపించారు. వెన్నుపోటు, బెల్ట్ షాప్, జన్మభూమి కమిటీలకు పేటెంట్ తెచ్చుకున్నారు. దుర్మార్గాలు చేయడానికి ఘనమైన పేరు సంపాధించుకున్నారు. ఆయన కుమారుడు లోకేష్ ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగంతో అటువంటి దుర్మార్గమైన పేరునే తనకు తెచ్చుకున్నారు. ఈ పుస్తకాన్ని రాష్ట్ర ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ పుస్తకాన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనూ విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివితే ఈ పాలనలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఈ పాలనను నిలదీయాలి. ఆన్లైన్లో కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఈ పుస్తకం డౌన్లోడ్ అవుతుంది. ప్రజలు వాస్తవాలతో కూడిన పుస్తకాన్ని చదివి, చైతన్యవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని అంకుశంతో పొడిచి, హామీల అమలుకు మెడలు వంచి పనిచేయించుకోవాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించడం మొదలుపెడితే తాము చేస్తున్న దాష్టీకాల అమలుకు వెనుకాడే అవకాశం ఉంటుంది’ అని సజ్జల చెప్పుకొచ్చారు.
Read Also- Ahmadabad Plane Crash: ఎవరూ మిగల్లేదు.. విమాన ప్రమాదంలో షాకింగ్ నిజాలు