Deputy CM Pawan Kalyan: అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభోత్సవం కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి రాష్ట్ర సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. ధర్మవరం శాలువాను కప్పి సన్మానించారు. అనంతరం ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా అమరావతి పనులకు తిరిగి బీజం పడటం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దీవిసీమ తుపాను వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్లు.. గత ప్రభుత్వం రాష్ట్రం, అమరావతి భవిష్యత్ ను తుడిచిపెట్టేసిందని పవన్ అన్నారు. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకు వచ్చేలా పనిచేశారని ఆరోపించారు. అమరావతి పనులు పునః ప్రారంభమైన ఈ సందర్భంగా.. రాజధాని భూములిచ్చిన రైతులకు తన అభినందనలు తెలియజేస్తున్నట్లు పవన్ తెలిపారు. రాజధాని పోతుందేమోనన్న బాధతో 5 కోట్ల మంది ప్రజానీకం తరపున అమరావతి రైతులు చేసిన పోరాటం మరువలేనిదని పవన్ అన్నారు.
Also Read: Indonesia Weird Traditions: ఇదేం విడ్డూరం.. శవాలను తవ్వి తీస్తారట.. ఆపై పూజిస్తారట.. గొప్ప ట్రెడీషనే!
అమరావతి సర్వశ్రేష్ట రాజధానిగా ఆవీర్భవిస్తుందని ఈ వేదిక ద్వారా తమ ప్రభుత్వం హామీ ఇస్తున్నట్లు పవన్ అన్నారు. అమరావతి కాంక్రీట్ జంగిల్ గా మిగిలిపోకుండా జవాబుదారితనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్ డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి వేగంగా జరుగుతున్నట్లు పవన్ చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మన అమరావతే కాకుండా రహదారులు, రైల్వేలు, పారిశ్రామిక, రక్షణ రంగాలకు సంబంధించి రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
మరోవైపు పహల్గాం దాడి ఘటనపైనా పవన్ స్పందించారు. పహల్గామ్ దుర్ఘటనలో 27 మంది మరణించారని… ఈ సమయంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీ అమరావతి కోసం ఇక్కడకు రావడం… అమరావతిపై ఆయనకున్న ఇష్టానికి నిదర్శనమని పవన్ అన్నారు. మరోవైపు చంద్రబాబు గురించి ప్రస్తావించిన పవన్ ఆయన ఎంతో విజన్ ఉన్న నాయకుడని కితాబిచ్చారు. ఎంతో దూరదృష్టితో హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రసంగం తర్వాత తన చైర్ వద్దకు వెళ్లిన పవన్ ను ప్రధాని మోదీ స్వయంగా పిలిచారు. పవన్ చూసుకోకపోవడంతో పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్ ప్రధాని పిలుస్తున్నారని చెప్పారు. దీంతో పవన్ వెంటనే అలర్ట్ అయ్యి ప్రధాని వద్దకు చకా చకా వెళ్లారు. ఈ నేపథ్యంలో పవన్ స్పీచ్ ను మెచ్చుకుంటూ మోదీ అభినందించారు. అంతేకాకుండా చేతిలో ఒక చాక్లెట్ సైతం పెట్టారు. అది చూసి పవన్ మురిసిపోతూ తన చైర్ వద్దకు వెళ్లారు.