CM Chandrababu: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తలపెట్టిన సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII partnership summit 2025) రేపటి నుంచి రెండ్రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో పలు దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులు విశాఖకు చేరుకుంటున్నారు. చంద్రబాబుతో భేటి అయ్యి పెట్టుబడుల గురించి చర్చలు మెుదలు పెట్టేశారు. ఇదిలా ఉంటే విశాఖలో నేడు ఇండియా – యూరప్ బిజినెస్ పార్టనర్ షిప్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖకు గూగుల్ వచ్చే విషయమై కీలక ప్రకటన చేశారు.
విశాఖకు ఐరోపా ప్రతినిధులు
విశాఖపట్నంలో జరిగిన ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్ షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఫ్రాన్స్, జర్మనీ, ఆర్మేనియా, నెదర్లాండ్ తదిరత దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. పలు కంపెనీ చైర్మన్లు, సీఈఓలు, సీఐఐ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా యుద్ధ ప్రాతిపదికన కంపెనీల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
2-3 రోజుల్లో గూగుల్ శంకుస్థాపన
కేవలం 45 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేసి.. త్వరితగతిన పరిశ్రమలు ప్రారంభిచేలా ప్రోత్సహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇటీవల ప్రీమియర్ ఎనర్జీస్ అనే సంస్థకు వన్ కాల్ – వన్ డీల్ (One Call – One Deal) ప్రాతిపదికన కేవలం 45 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేసినట్లు స్పష్టం చేశారు. రూ.6000 కోట్లతో ఆ సంస్థ నిర్మాణ పనులను కూడా ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అటు గూగుల్ రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని.. 2-3 రోజుల్లో విశాఖలో శంకుస్థాపన కూడా జరగనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
తైవాన్ ప్రతినిధులతో భేటి
సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటి అయ్యారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని తైవాన్ కంపెనీలను సీఎం ఆహ్వానించారు. అలీజియన్స్ గ్రూప్ రూ.400 కోట్ల వ్యయంతో కుప్పంలో ఇండో – తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తైవాన్ ప్రతినిధి బృందం తెలిపింది. పాద రక్షల తయారీ కంపెనీ పౌ చెన్ గ్రూప్ ఫుట్ వేర్ యూనిట్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఓర్వకల్లులో ఇమేజ్ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్ కు చెందిన క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. ఓర్వకల్లు సమీపంలోనే ఇ-జౌల్ ఇండియా జాయింట్ వెంచర్ సంస్థ అడ్వాన్స్డ్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 2.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్ధ్యంతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ, కాథోడ్ యాక్టివ్ మెటిరియల్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రతిపాదించింది.
Also Read: Emerging New AP: ఏపీకి నూతన శకం!.. పెరుగుతున్న పెట్టుబడులు.. భవిష్యత్పై చిగురిస్తున్న ఆశలు!
ఇటలీ రాయబారితో సమావేశం
మరోవైపు విశాఖకు వచ్చిన ఇటలీ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీ.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కీలక రంగాలైన ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి-ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఆయన ప్రతిపాదించినట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది. మరోవైపు విశాఖపట్నం వచ్చిన ఈస్ట్రన్ నావల్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా కూడా సీఎం చంద్రబాబుతో భేటి అయ్యారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం, నౌకా సాంకేతికతకు తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
