AP Farmers: రైతన్నా.. కన్నీరు నేల రాల్చవద్దు.. మీకు అండగా ప్రభుత్వం ఉంది.. డోంట్ వర్రీ అంటూ సీఎం చంద్రబాబు అభయమిచ్చారు. ఏపీలోని రైతులకు సీఎం ఇచ్చిన హామీపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు సీఎం ఇచ్చిన హామీ ఏమిటో తెలుసుకుందాం.
ఏపీలో గత రెండు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రైతులు చేతికి వచ్చిన పంట దెబ్బతింటుందని పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. పలు ఉద్యానవన పంటలు అయితే, అకాల వర్షం ధాటికి నేలకొరిగాయి. పంట దిగుబడి అధికంగా వచ్చిందని రైతులు ఆనందపడ్డా, ఆ ఆనందం అకాల వర్షం ధాటికి ఆవిరైపోయింది. ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ గత కొద్దిరోజులుగా వర్షసూచన ఉందని రైతులను అప్రమత్తం చేసింది. కానీ అప్పటికే పంట పొలాల్లో ఉండడంతో రైతులు ఏమి చేయలేని పరిస్థితి. అందుకే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఏపీలో కురిసిన అకాల వర్షప్రభావం అధికంగా ఉద్యానవన పంటలపై చూపిందని చెప్పవచ్చు. దీనితో అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనంగా మారింది. చేతికి వచ్చిన పంట కళ్లముందే నాశనం కావడంతో ఆ రైతులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించారు. దీనితో సీఎం చంద్రబాబు ఆదేశాలతో వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన పంటనష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేసారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు వివరించారు. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు.
అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల జరిగిన పంటనష్టం వివరాలను క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించామని అధికారులు సీఎంకు వివరించారు. వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులకు సీఎం సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
Also Read: Viral: ఐపీఎల్ ఎఫెక్ట్.. ఉద్యోగమే ఊడింది.. మరీ ఇంత పిచ్చా!
అకాల వర్షం ధాటికి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద అకాల వర్షాలు ఏపీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగల్చగా, సీఎం చంద్రబాబు ప్రకటనతో రైతులకు ప్రభుత్వం నుండి భరోసా లభించింది. రైతన్నా.. నీ కన్నీరు నేల రాల్చవద్దు.. ప్రభుత్వం ఆదుకొనేందుకు నీ ముందుకు వస్తోంది. ఆత్మహత్యలు వద్దు.. ఆత్మవిశ్వాసంతో జీవించు అంటోంది ప్రభుత్వం.