అమరావతి, స్వేచ్ఛ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు టీడీపీ కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకచోట జాబ్ తీసి, మరోచోటికి పంపి కొత్త ఉద్యోగులకు మంగళం పాడే రీతిలో ఈ నిర్ణయం ఉందని వైసీపీ మండిపడుతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తూ, సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించింది.
ఇకపై A కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు, B కేటగిరీలో 7, C కేటగిరీ సచివాలయాల్లో 8 మంది సిబ్బంది మాత్రమే ఉండనున్నారు. జనాభా గణాంకాలు, ప్రస్తుత వర్క్ లోడ్ ఆధారంగా ఈ విభజన రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా పలు సచివాలయాల్లో ఎక్కువమంది, మరికొన్నిచోట్ల తక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో, ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ప్రక్షాళన నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈ చర్యలతో సమానమైన పనితో సచివాలయ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించడమే లక్ష్యం అని సర్కార్ తెలిపింది.