AP Govt: రాష్ట్రంలో పింఛన్ కోసం ఎదురుచూస్తున్న పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంలో భాగంగా రాష్ట్రంలో 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఇంకా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని పేర్కొన్నారు. వారందరికి త్వరలోనే పింఛను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో వితంతువులతో పాటు అర్హులైన వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఏప్రిల్ నుంచే వితంతువులకు పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వ భావించినప్పటకీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో మే నుంచి ఇచ్చేందుకు సన్నాహాకాలు చేస్తోంది. ఈ మేరకు ప్రతి నెలా 4 వేల రూపాయలు వితంతువులకు అందించనుంది. మిగిలిన అర్హులైన వారికి కూడా త్వరలోనే అందించనుంది. కాగా, ఇప్పటికే అనర్హులైన 14వేల మందికి పింఛన్లు తొలగించినట్లు తెలుస్తోంది.
Indian Railways: ప్లీజ్.. అలా చేయవద్దు.. ఇండియన్ రైల్వే కీలక సూచన..
కాగా, కూటమి ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. అధికారంలోకి రాగానే తొలుత ప్రవేశపెట్టింది పింఛను పథకమే. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రూ. 4వేలు అర్హులైన వారికి అందజేస్తోంది. గత ప్రభుత్వ 3వేలు అందజేయగా దాన్ని ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుకళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, కళాకారులకు ఈ పథకం కింద వస్తారని తెలిపింది. దివ్యాంగులకు గత ప్రభుత్వం రూ. 3 వేలు ఇవ్వగా కూటమి ప్రభుత్వం దాని ఏకంగా రూ. 6వేలకు పెంచడం గమనార్హం. సీఎం సహా ప్రజాప్రతినిధులు ఎంపిక చేసిన ఆయా గ్రామాల్లోని పేదల ఇండ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ ను అందజేస్తున్నారు. దీని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ప్రతి ఏటా పెన్షన్ల కోసం రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కొత్తగా 5 లక్షల మంది చేరనుండటంతో అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. పెన్షన్ పంపిణీని సులభతరం చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు చెప్పారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కొత్త పెన్షన్ల గురించి మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. అర్హులందరికి పింఛన్ అందేలా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి, దాన్ని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పేదరిక నిర్మూలనకు నిరుపేద కుటుంబాలను దాతలకు అప్పగించి, వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు.