Ap Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతోనే సభ మొదలైంది. సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి ఎమ్మెల్యేలు వచ్చారు. వైసీపీ నేత జగన్ ఇవాళ తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. సభ ప్రారంభమైన కాసేపటికే… వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ఓ వైపు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఇక, కాసేపు నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించాలని, ప్రజల గొంతుక వినిపించాలంటే హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు.
అనంతరం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అని అన్నారు. వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ అమలు చేయడం లేదని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. మిర్చి రైతుల సమస్యలపై జగన్ గొంతు విప్పాకే ప్రభుత్వం స్పందిచిందన్నారు.
కాగా, అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్… ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారన్నారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాకే అభివృద్ధి పనులు మొదలయ్యాయని, పెన్షన్ రూ. 4వేలు చేశామని, అన్న క్యాంటిన్లను తెరిచి పేదల ఆకలి తీర్చామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని పేర్కొన్నారు.
Also Read:
YCP: చంద్రన్న పగ, చంద్రన్న దగా; ఈ రెండే అమలవుతున్నాయ్