AAP Minister Atishi says BJP Planning To Impose President’s Rule In Delhi
జాతీయం

Delhi : ఢిల్లీలో ప్రెసిడెంట్ పాలన..!

– ఆసక్తికరంగా హస్తిన రాజకీయాలు
– బీజేపీ అనుకున్నదే జరుగుతోందా?
– ఆపరేషన్ ఆప్ వర్కవుట్ అవుతోందా?
– మంత్రి రాజీనామా, అధికారుల గైర్హాజరు దేనికి సంకేతం?
– రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా?
– జాతీయ రాజకీయాల్లో జోరుగా చర్చ

BJP Planning To Impose President’s Rule In Delhi : లిక్కర్ స్కాం కేసు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉరితాడుగా మారింది. ఇది కాషాయ కుట్ర అని ఆ పార్టీ నేతలు చెబుతున్నా జరగాల్సిన నష్టం జరుగుతోంది. బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరుతోంది. ఓవైపు కీలక నేతలు జంప్ అవుతున్నారు. ఇంకోవైపు అధికారులు మొండికేస్తున్నారు. దీంతో రాష్ట్రపతి పాలన దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏకంగా ఆప్ మంత్రి ఈ ప్రకటన చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

బీజేపీకి కంట్లో నలుసుగా ఆప్

అవినీతి అంతం అంటూ దేశ రాజకీయాల్లో అడుగు పెట్టింది ఆప్. అనతి కాలంలోనే గుర్తింపు సాధించింది. ప్రజల మన్ననలు పొందింది. ఢిల్లీ గడ్డపై జెండా ఎగురవేసింది. తర్వాత పంజాబ్‌ను కైవసం చేసుకుంది. తక్కువ టైమ్‌లోనే జాతీయ పార్టీగా అవతరించింది. దీంతో బీజేపీకి కంట్లో నలుసుగా మారింది ఆప్. ఎలాగైనా కేజ్రీవాల్‌ను దారికి తెచ్చుకోవాలని కాషాయ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు జైలుకు పంపి, పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తోందని ఆప్ నేతలు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్రపతి పాలన అంశం కూడా తెరపైకి వచ్చింది.

కుట్ర బయటపెట్టిన మంత్రి అతిషి!

ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఎంతో కీలకం. ఆ ముగ్గురూ ఇప్పుడు జైలులో ఉన్నారు. మరీ ముఖ్యంగా సీఎం కేజ్రీవాల్ జైలుకెళ్లాక మంత్రి ఆతిషి అత్యంత కీలకంగా మారారు. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలన్నీ ఈమెనే మీడియాకు వివరిస్తున్నారు. తాజాగా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ యత్నిస్తోందని మాట్లాడారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని, తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని ఆరోపించారు. ప్రభుత్వం తరఫున ఆతిషి కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు ఆజ్యం పోస్తున్నాయి.

మంత్రి రాజీనామాతోనే మొదలైందా?

ఈమధ్య మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి హోదాలో ఉన్న నాయకుడు రాజీనామా చేయడం, ఆప్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు చేయడం బాగా హైలైట్ అయ్యాయి. ఆప్ ప్రభుత్వం అత్యంత కష్టాల్లో ఉండగా ఆనంద్ పార్టీకి దూరమవ్వడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అంతేకాదు, సీఎం కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రెటరీ వైభవ్‌ కుమార్‌ను విజిలెన్స్ డిపార్ట్ మెంట్ విధుల నుంచి తొలగించింది. ఆయన నియామకం నిబంధనల ఉల్లంఘన అంటూ చర్యలు తీసుకుంది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఎప్పుడో 2007లో జరిగిన ఘటనను వైభవ్ తొలగింపునకు కారణంగా చూపింది. ఆ ఏడాది విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశారని నోయిడా పోలీసులు కేసు పెట్టారు. కేజ్రీకి పీఎస్‌‌గా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని తమ దర్యాప్తులో తేలినట్లు విజిలెన్స్‌ తెలిపింది. అయితే, ఢిల్లీ మద్యం స్కాంలో ఏప్రిల్ 8న వైభవ్‌‌ను ఈడీ ప్రశ్నించింది. మరోవైపు, ఇటీవల ప్రబుత్వం నిర్వహించే సమావేశాలకు అధికారులు గైర్హాజరవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజల తీర్పుకు విరుద్ధంగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే కుట్రలు జరుగుతున్నాయని మంత్రి అతిషి ఆరోపణలు చేశారు.