Maha Kumbh: మన ఇళ్లు ఊడ్చాలంటే ఒకరు సరిపోతారు. ఏదైనా వేడుక జరిగితే కొంతమంది కలిసి ఊడుస్తారు. మరీ… ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమైన కుంభమేళా వద్ద శుద్ధి చేయాలంటే… ఎంతమంది కావాలి? అబ్బో… ఎంతైనా సరిపోరు అనే ఆన్సర్ వస్తుంది ఎవరి నోటి వెంటైనా. ఎందుకంటే అంత పెద్ద మహా జాతర. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు, వాళ్లు ఆచరించే పుణ్య స్నానాలు, అక్కడి హడావుడి. వచ్చే వాళ్లు వస్తుంటారు… వెళ్లే వారు వెళ్తుంటారు… వీఐపీల తాకిడి.. అబ్బో మెయింటెనెన్స్ అంతా ఈజీ కాదు.
సరే.. ఆ విషయాన్ని పక్కన పెడితే, మహాకుంభ్ బుధవారంతో ముగుస్తున్నందున త్రివేణి సంగమం వద్ద క్లీన్ డ్రైవ్ ను నిర్వహించారు. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగింది. ఇందులో దాదాపు 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ఢ్ రికార్డ్స్ ప్రతినిధులు, ప్రయాగ్ రాజ్ మేయర్ గణేశ్ కేసర్వాని, మహాకుంభ్ ఉత్సవ స్పెషల్ ఈవో రాణా తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, రికార్డుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, 2019లో ఇదే ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళాలో 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు.
ఇక, మహాకుంభమేళాకు భక్తులు తాకిడి అంతకంతా పెరుగుతోంది. జనవరి 13న మొదలైన ఈ అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో దాదాపు 60 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని అంచనా. చివరి రోజైనా మహా శివరాత్రి రోజు భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.