Ind vs Pak: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. బంతి బంతికి ప్రేక్షకుల కిక్కు పీక్స్కు చేరుతుంది. ఈ గెలుపు వేటలో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటూ బెట్టింగులు కూడా జోరుగా జరుగుతుంటాయి. చాలా కాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ పుణ్యమా అని టీమిండియాతో పాక్ తలపడింది. ప్రేక్షకులకు క్రికెట్ పండుగ వచ్చినట్టయింది. అనుకున్నట్టే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను సగం ఆటలో టీమిండియా డామినేట్ చేసింది.
టాస్ ఓడిన భారత్.. చెత్త రికార్డ్
టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. వన్డేల్లో వరుసగా అత్యధిక మ్యాచుల్లో టాస్ ఓడిపోయింది. ఇప్పటిదాకా నెదర్లాండ్స్ 11 సార్లు వరుసగా టాస్ ఓడింది. దాన్ని బీట్ చేసి టీమిండియా 12 సార్లు ఓడింది. 2023 ప్రపంచ కప్ నుంచి ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్లోనూ భారత్ టాస్ గెలవలేదు. ఈ 12 మ్యాచ్ల్లో రోహిత్ శర్మ 9 సార్లు, కేఎల్ రాహుల్ 3 సార్లు టాస్ గెలవలేకపోయారు.
అదరగొట్టిన భారత బౌలర్లు
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ జట్టు 49.4 ఓటర్లలో 241 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఇమామ్(1), బాబర్(23) పెద్దగా రాణించలేదు. వీరిద్దరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. తర్వాత వచ్చిన షకీల్(62), రిజ్వాన్(46) స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. పాక్ 241 పరుగుల్లో వీరిద్దరిదే ఎక్కువ రన్స్ చేశారు. ఈ జోడీ మూడో వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సల్మాన్(19), తాహిర్(4), కుష్దిల్(38), షమీమ్ అఫ్రిది(0), నసీమ్(14), హరిశ్ రౌఫ్(8), అబ్రార్ అహ్మద్(0) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, జడేజా తలో వికెట్ తీశారు. మహ్మద్ షమీ మాత్రం వికెట్ తీయలేకపోయాడు.
నిలకడగా ఆడుతున్న భారత్.. ఇట్స్ రివెంజ్ టైమ్
241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలోకి దిగారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతున్నారు. స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే నిలకడగా ఆడి భారత్ను గెలిపించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ గెలువగా, దానికి రివెంజ్ ఇప్పుడు తీర్చుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.