Hathras Stampede : యూపీలోని హథ్రస్ తొక్కిసలాట దేశ చరిత్రలో ఓ పీడ కల. ఆ తొక్కిసలాట ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై విచారించేందుకు యూపీ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో పాటు ముగ్గురు సభ్యులను కలిపి ఒక కమిషన్ వేసింది. అయితే తాజాగా ఆ కమిషన్ బోలేబాబాకు (bholebaba) క్లీన్ చిట్ ఇచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తొక్కిసలాటకు బోలేబాబా కారణం కాదని.. ఎక్కువ మంది భక్తులు రావడం వల్లే తొక్కిసలాట జరిగి ఊపిరాడక చనిపోయినట్టు కమిషన్ పేర్కొన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఈ జ్యుడీషియల్ కమిటీ ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ తొక్కిసలాటకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం అని ఆరోపించింది. కార్యక్రమ నిర్వాహకులే దీనికి పూర్తి బాధ్యులు అని.. బోలేబాబా తొక్కిసలాటకు కారణం కాదని చెప్పుకొచ్చింది ఈ కమిషన్. హథ్రస్ జిల్లాలో బోలేబాబా నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమానికి 70వేల మంది దాకా భక్తులు వెళ్లారు. బోలేబాబా పాదధూళిని తీసుకుని నుదిటికి రాసుకుంటే మంచి జరుగుతుందని వారంతా ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వేలాది మంది గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత బోలేబాబా సైలెంట్ గానే ఉంటున్నారు. ఈ ఘటనకు బోలేబాబానే కారణం అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వచ్చాయి. అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ అప్పట్లో యూపీ ప్రభుత్వం మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా క్లీన్ చిట్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.