Water Dispute: పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టును ఎజెండాలోకి తీసుకురావద్దని కేంద్రానికి తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండింటిపై చర్చ వద్దు కమిటీ సమావేశంలో తెలంగాణ పేర్కొంది. ఈ ప్రాజెక్టు సంబంధిత వివాదం కారణంగా ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయలేదని కూడా తెలిపింది. భవిష్యత్లోనూ ఎజెండాలో పోలవరం, నల్లమల సాగర్ అంశాన్ని చేర్చడానికి వీల్లేదని, ఎజెండాలో పెడితే సమావేశానికి రాబోమని తేల్చి చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీ మీటింగ్ శుక్రవారం ఢిల్లీలో నిర్వహించారు.
పూర్తిగా ఎజెండా సిద్ధం
రెండు రాష్ట్రాల నుంచి కమిటీ సభ్యులు హాజరయ్యారు. తొలి సమావేశం పూర్తిగా ఎజెండా సిద్ధం చేయడానికే నిర్వహించామని, ఏపీ–తెలంగాణ రెండూ కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించిన తమ తమ అంశాలను సెంట్రల్ వాటర్ కమిషన్ కు ప్రజెంటేషన్ రూపంలో సమర్పించాలని కోరింది. కమిటీ పరిధి గోదావరి, కృష్ణా నదీజలాలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకే పరిమితమని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలను పక్కాగా తేల్చాల్సిందేనని తెలంగాణ అధికారులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సగం వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందే
ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా బచావత్ కేటాయింపుల్లో సగం వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని, అది ఈ ఏడాది నుంచే అమలు కావాలని కోరారు. కృష్ణా డెఫిసిట్ బేసిన్ అని, అక్రమ నీటి మళ్లింపులను ఆపాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పలు ప్రాజెక్టులను చేపట్టిందని, డీపీఆర్లు కూడా లేవని, వాటిపైనా చర్చించాలని కోరారు. తెలంగాణ ఏర్పడడానికి ముందే స్టార్ట్ చేసిన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని, పాలమూరు వంటి ప్రాజెక్టులకు తొందరగా అనుమతులు వచ్చేలా చూడాలని కోరారు. ఏపీ పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రస్తావన రావడంతో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఫైర్ అయ్యారు.
12 అంశాలపై కమిటీ దృష్టి
రెండు గంటల పాటు కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ అధికారులు 12 అంశాలపై కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఎజెండాలో ఏ ఏ అంశాలు ఉండాలో చర్చించారు. వారం రోజుల్లో తెలంగాణ ఏపీ అభ్యంతరాలను కమిటీకి ఇవ్వాలని సిడబ్ల్యూసీ తెలిపింది. గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై పూర్తి డేటా, వివరాలను రెండు రాష్ట్రాల నుంచి కోరింది. ఈ వారంలో రెండు రాష్ట్రాలు తమ తమ ఎజెండాలు మార్చుకోవాలని, దానిపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాలు అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. వచ్చే నెలలో మరోసారి కమిటీ సమావేశం జరగనుంది. ఎజెండా ఖరారైన తర్వాత ఒక్కో అంశంపై విడివిడిగా చర్చలు జరగనున్నాయని, కృష్ణా నీటి పంపకాల అంశం ప్రస్తుతం ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నదని పేర్కొన్నారు.
ఏపీపై తెలంగాణ ఫైర్
బచావత్ అవార్డు విషయంలో ఏపీ కొర్రీలు పెట్టినట్టు అధికారులు తెలిపారు. వారికి దీటుగా బదులిచ్చామని వెల్లడించారు. తమ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతమ్మసాగర్ వంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినప్పుడు లేని వివాదం.. ఇప్పుడు పోలవరం నల్లమలసాగర్ విషయంలోనే ఎందుకని ఏపీ అధికారులు లేవనెత్తగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, నీటి కేటాయింపులు, వినియోగాలపై సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది.
Also Read: Water Disputes: నేడు జల వివాదాలపై కమిటీ భేటీ.. మంత్రి, అధికారుల మధ్య గ్యాప్?

