KTR: తెలంగాణలో ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన ‘ప్రజా పాలన’ సాగడం లేదని, ఇది కేవలం రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న ‘రాక్షస పాలన’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అభివర్ణించారు. తెలంగాణ భవన్లో సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులురాజ్యాంగ ఉల్లంఘనలపై ప్రదర్శించిన లఘు నాటిక ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ,రాహుల్ గాంధీ అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.రాహుల్ గాంధీ తుక్కుగూడలో విడుదల చేసిన ‘న్యాయ పత్రం’లో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడారని, కానీ ఆ వేదికపైనే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వారు ఆయన పక్కనే కూర్చున్నారని గుర్తు చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, కాంగ్రెస్ న్యాయ పత్రంలో న్యాయం అంతే ఉందని ఎద్దేవా చేస్తూ, దీన్ని ‘అన్యాయ పత్రం’గా పిలవాలని సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి “జెండా గద్దెలను కూల్చేయండి” అని బహిరంగ సభల్లో పిలుపునివ్వడం శాంతిభద్రతలను, రాజ్యాంగ విలువలను సమాధి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం శూన్యం
కోదాడలో దళిత యువకుడు కర్రా రాజేష్ను పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపారని, ఇది జరిగి 60 రోజులు గడిచినా సీఎంకానీ, స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kmar reddy) కానీ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను ఉగ్రవాదుల మాదిరిగా అరెస్ట్ చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విలువల హననం కాదా అని ప్రశ్నించారు. లగచర్లలో గిరిజన ఆడబిడ్డల ఇళ్లలోకి చొరబడి వారి వ్యక్తిత్వ హననం చేయడం, భూముల కోసం పోరాడుతున్న రైతులను జైళ్లలో పెట్టడం ఈ ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. హైడ్రా(Hydraa), మూసి పేరిట పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం, లగచర్లలో గిరిజన ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం చేయడం రేవంత్ రెడ్డి రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు. రైతు, యువజన, ఎస్సీ,ఎస్టీ,బీసీ డిక్లరేషన్ల పేరుతో అందరినీ మోసం చేశారని, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు.”రాజ్యాంగం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వారిలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం శూన్యం” అన్న అంబేద్కర్ మాటలను ఉటంకిస్తూ, నేడు కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కాంగ్రెస్ పోటీ పడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో ‘ప్రజా పాలన’ మృగ్యమై ‘అనుముల రాజ్యాంగం’ నడుస్తోందని, ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఒకవైపు, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న కాంగ్రెస్ మరోవైపు దేశానికి పెనుముప్పుగా మారాయని, వీరి నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు.
Also Read: V. C. Sajjanar: ‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?’ అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం!
తీవ్రమైన వ్యతిరేకత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారో కళ్లకు కట్టేలా తమ లగునాటిక ద్వారా వివరించారన్నారు. తమ యూనివర్సిటీ భూముల పైన దౌర్జన్యం చేసిన రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ఇందులో స్పష్టంగా కనిపించిందన్నారు. హెచ్సీయూ విద్యార్థుల పోరాటాన్ని అభినందించారు. బాధ్యత గల విద్యార్థులుగా తమ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి కాపాడుకోవడానికి వారు చేస్తున్న కృషి దేశాన్నే కదిలించిందని కొనియాడారు. ముఖ్యమంత్రి ఈ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చెరబట్టే ప్రయత్నం చేశారని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ. 10,000 కోట్లు ఉంటుందని, తనకు సంబంధం లేని భూములను, చెరువులను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి ‘ఫైనాన్షియల్ ఫ్రాడ్’కు పాల్పడ్డారని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. భారీ అవినీతిపై అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన నిలదీశారు.
Also Read: Dubbaka News: దుబ్బాకలో తలకిందులుగా ఎగిరిన త్రివర్ణ పతాకం.. ఆగ్రహించిన నాయకులు..?

