Mohan Babu: తెలుగు సినిమాకు, ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ సమాజానికి చేస్తున్న సేవను గుర్తించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లెజెండరీ యాక్టర్ డా. మోహన్ బాబు (Mohan Babu)కు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును (Governor’s Award of Excellence) ప్రదానం చేయనుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 26 జనవరి, 2026న కోల్కతాలోని లోక్ భవన్లో జరిగే ఉత్సవ కార్యక్రమంలో ఈ అవార్డుని మోహన్ బాబుకు ప్రదానం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) గవర్నర్, విశిష్ట అతిథుల సమక్షంలో ఈ అవార్డుని అందించనున్నారు. ఆ తర్వాత సాంప్రదాయకంగా ఎట్ హోమ్ రిసెప్షన్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక తెలుగు నటుడికి ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. తెలుగు సినిమా ప్రస్తుతం భారత సాంస్కృతిక, సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తెలుగు సినిమా పరిశ్రమకి యాభై ఏళ్లకు పైగా సేవలందించిన మోహన్ బాబుకు ఈ అవార్డుని ప్రదానం చేయడం గర్వించదగ్గ విషయమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Also Read- Padma Awards 2026: మమ్ముట్టికి పద్మ భూషణ్.. మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్లకు పద్మశ్రీ
క్రమశిక్షణకు నిదర్శనం
ఈ అవార్డు మోహన్ బాబు సినీ జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ అవార్డు.. కళామతల్లికి 50 సంవత్సరాలకు పైగా ఆయన చేసిన సేవ, ఆయన నిరాడంబరమైన జీవితం, భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఎదగడం వరకు చేసిన సుదీర్ఘ ప్రయాణం, క్రమశిక్షణ, పట్టుదలకి నిదర్శనంగా నిలుస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా మోహన్ బాబు భారతీయ సినిమాను విస్తృతమైన, వైవిధ్యభరితమైన కథల ద్వారా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా మోహన్ బాబు పలు వేదికలపై అవార్డులు, ప్రశంసలు పొందారు. సినీ కెరీర్కు అతీతంగా విద్య, సామాజిక అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గౌరవం కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు, ప్రతిచోటా తెలుగు ప్రజలకు గర్వకారణమైన క్షణంగా నిలవడమే కాకుండా.. జాతీయ వేదికపై తెలుగు సినిమా స్థాయిని పునరుద్ఘాటిస్తుంది.
Also Read- Purushaha: ఆస్కార్ విన్నర్ ఆలపించిన మగాళ్లపై సానుభూతి పాట.. జాలిపడేదెవ్వడు?
హద్దులు, సరిహద్దులు లేవ్..
పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. అత్యంత కళాత్మక, సినిమా వారసత్వం కలిగిన రాష్ట్రంగా భారతదేశంలో కీర్తి ప్రతిష్టల్ని సాధించింది. బెంగాల్ ప్రభుత్వం ఇస్తున్న ఈ అవార్డు భారతీయ సంస్కృతి, సినిమాను నిర్వచించే వైవిధ్యంలో ఐక్యత స్ఫూర్తిని సూచిస్తుంది. భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గుర్తింపు రావడంతో కళకి ఎలాంటి హద్దులు, సరిహద్దులు ఉండవని చాటి చెప్పే అద్భుతమైన జ్ఞాపకంగా నిలుస్తుందని టాలీవుడ్ వర్గాలు, అభిమానులు భావిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మోహన్ బాబు ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ీ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

