Davos Summit: దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్(Chandrasekharan) భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047, ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రం రూపొందించిన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికల గురించి చెప్పారు.
ప్రభుత్వంపై ప్రశంసలు
భవిష్యత్ అవసరాలకు ప్రణాళికాబద్ధమైన కాంగ్రెస్ సర్కార్ ఆలోచనా విధానంపై టాటా చైర్మన్ ప్రశంసల వర్షం కురిపించారు. పెట్టుబడుల కోసం కాకుండా, విధానాలు, ఫ్యూచర్ విజన్ను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముందుకెళ్తున్నదని అభినందించారు. హైదరాబాద్లోని ప్రధాన క్రీడా మైదానాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే ఆలోచనలను టాటా గ్రూప్ చైర్మన్తో ముఖ్యమంత్రి పంచుకున్నారు. స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు, ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు. దేశంలో ప్రతిభ ఉన్నా దానికి తగిన మౌలిక సదుపాయాలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Also Read: Sonu Sood Praises Pawan: డిప్యూటీ సీఎం పవన్పై సోనూసూద్ పొగడ్తలు.. వీడియో ఇదిగో
అభివృద్ధిపై వివరణ
యువత నైపుణ్యాల అభివృద్ధిపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చడంలో టాటా టెక్నాలజీస్తో కలిసి పని చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ సెంటర్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికలను వివరించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆనంద్ మహీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనలు, 2036 ఒలింపిక్స్లో భారత్ పతకాలు సాధించేలా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.
ప్రభుత్వంతో భాగస్వామ్యానికి టాటా గ్రూప్ ఆసక్తి
హైదరాబాద్లో చేపడుతున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా చైర్మన్ ఆసక్తి చూపారు. రాజస్థాన్, మహారాష్ట్రలో నీటి వనరుల పునరుద్ధరణలో టాటా గ్రూప్ అనుభవాన్ని గుర్తు చేస్తూ, మూసీ అభివృద్ధిలో భాగస్వామిగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నది చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.
మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. ఏఐ డేటా సెంటర్లు, సెమీ కండక్టర్, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలపై టాటా చైర్మన్ ఆసక్తి చూపారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Medchal Congress: మేడ్చల్ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం.. కారణం ఇదే

