Hyderabad GCC: ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినియోగ రంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలివర్ సంస్థ, హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో భాగంగా మంగళవారం దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం యూనిలివర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సమావేశమైంది. తెలంగాణలో జీసీసీ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చించారు.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ వేగంగా మారుతున్నదని వివరించారు. దీనిపై స్పందించిన విల్లెమ్ ఉయిజెన్ హైదరాబాద్లో జీసీసీ ఏర్పాటు అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తున్నదని తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఇప్పటికే మెక్డొనాల్డ్స్, హైనెకెన్, కాస్టకో వంటి ప్రముఖ ఎఫ్ఎంసీజీ(త్వరగా వినియోగ వస్తువుల) సంస్థల జీసీసీలు విజయవంతంగా పని చేస్తున్నాయని చెప్పారు. తెలంగాణకు యూనిలివర్ విలువైన భాగస్వామి అని, వేగవంతమైన అనుమతులు, లైసెన్సింగ్ ప్రక్రియలతో వ్యాపారాలకు అనుకూల రాష్ట్రంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.
Also Read: Nitin Nabin – Modi: నేను బీజేపీ కార్యకర్తను… నాకు బాస్ నితిన్ నబీన్.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్లాస్టిక్ వినియోగ తగ్గింపు..
ఈ సమావేశంలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా తెలంగాణ రైజింగ్ బృందం, రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో త్వరగా వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని యూనిలివర్ను ఆహ్వానించారు. వాతావరణ పరిరక్షణ, నీటి వినియోగంలో సానుకూలత, ప్లాస్టిక్ వినియోగ తగ్గింపు వంటి యూనిలివర్ లక్ష్యాలను, తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పునరుత్పాదక శక్తి, నీటి సంరక్షణ, సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాలతో అనుసంధానం చేసే అంశాలపై కూడా చర్చలు జరిగాయి.
Also Read: Municipal Elections: మున్సిపాలిటీల పై ప్రధాన పార్టీల ఫోకస్.. అందరి చూపు అటు వైపే..?

