Jurala Project: బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్
ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల ప్రజాపాలనలో సాధ్యం
జూరాల ప్రాజెక్టు బ్రిడ్జి తో పాటు ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం .
భవిష్యత్తులో గద్వాల ప్రాంతం ఆత్మకూరు ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందంటూ ఆశాభావం
Jurala Project: గద్వాల నియోజకవర్గంలో గద్వాల మండల పరిధిలోని కొత్తపల్లి నుంచి ఆత్మకూరు వైపు వెళ్లే జూరాల ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జి (Jurala Project High Level Bridge) నిర్మాణం పనులను మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. జూరాల ప్రాజెక్ట్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్తో మాట్లాడి త్వరగా పనులను పూర్తిచేసి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గత సంవత్సరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్టు సందర్శన పరిశీలనకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు గద్వాలకు ఆత్మకూరు అనుసంధానంగా జూరాల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందంటూ మంత్రి శ్రీహరి గుర్తుచేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాంతాలకు మధ్య అనుసంధానం జరిగితే, రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని, తద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందంటూ మంత్రి ఉత్తమ్ సూచించారని చెప్పారు. సానుకూలంగా స్పందించిన సీఎం బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖ 121 కోట్లు రూపాయలు మంజూరు చేసిందన్నారు. ఇటీవల నది సమీపంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారన్నారు.
Read Also- Nitin Nabin – Modi: నేను బీజేపీ కార్యకర్తను… నాకు బాస్ నితిన్ నబీన్.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు నుంచి గద్వాలకు స్వల్ప వ్యవధిలో చేరుకుంటారని మంత్రి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు. గద్వాల నుంచి హైదరాబాదు వెళ్లే వారికి 35 కిలోమీటర్ వరకు ప్రయాణ దూరం తగ్గుతుందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం తరుణంలోనే ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేయాలని ఆలోచించామన్నారు. ఈ ఫోర్ లైన్ నిర్మాణం చేస్తే గద్వాల నుంచి ఆత్మకూర్ మక్తల్ , మంత్రాలయం, బళ్లారి వరకు వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం తమ హయాంలో జరగడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులో నీళ్ల స్టోరేజీ చెక్ డామ్లు ఏర్పాటు చేస్తామని, దీనికి నెమలి చెరువు అని నామకరణం చేస్తామని వెల్లడించారు. జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఉమ్మడి పాలమూరు జిల్లా తోపాటు తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ గద్వాల ఆత్మకూర్ ప్రాంతం మన సౌకర్యంతో పెరగడంతో వ్యాపారాలు కూడా పెరుగుతాయని, రైతులు కూడా అభివృద్ధి చెందుతారన్నారు. దీని వల్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందడంతోపాటు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని మంత్రి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు.
అనుసంధానం జరిగితేనే అభివృద్ధి: ఎమ్మెల్యే
గద్వాల ప్రాంతం అభివృద్ధి చెందాలంటే గద్వాలకు అనుసంధానంగా ఆత్మకూరు మక్తల్ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, ఈ రెండు ప్రాంతాలకు అనుసంధాలు ఉన్నప్పుడే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే కృష్ణమోహన్ అన్నారు. ‘‘ మా ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున ఉండడంతో ఆ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఇప్పుడు మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఈ జూరాల ప్రాజెక్ట్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తుండడంతో ఈ రెండు ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాలకు ఏ విధంగా అనుసంధానం ఉండడంతో ఈప్రాంతాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో జూరాల ప్రాజెక్టు సందర్శన వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఈ ప్రాంతానికి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరడంతో వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం జరిగిందని ప్రస్తావించారు. ‘‘ఈ నిర్మాణం పనుల్లో భాగంగా ఫోర్ లైన్స్ రోడ్డు అనుసంధానంతో ఏర్పాటు చేయడం వల్ల గద్వాల నుంచి మంత్రాలయం మంత్రాలయం నుంచి బళ్లారి వరకు ఆంధ్ర- తెలంగాణ- కర్ణాటక ప్రాంతాలకు అనుసంధానం జరిగి ఈ ప్రాంతాలలోని ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందారు. వ్యాపార రంగాలు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. వ్యాపారాలు అభివృద్ధి చెందడంతొ ప్రజలకు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లేవారికి కూడా ఆత్మకూరు వైపుగా వెళితే దాదాపుగా 35 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. 10 నిమిషాల్లో ఆత్మకూరుకు చేరుకునే అవకాశం ఉంటుంది. జూరాల ప్రాజెక్టులు లోయర్ జూరాల దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతపు చెక్ డ్యామ్ ఏర్పాటు చేస్తే 4 నుంచి 5 టీఎంసీల నీళ్లు స్టోర్ చేయవచ్చు. తద్వారా రైతులకు నీళ్లు ఉపయోగపడితే రైతులు కూడా అభివృద్ధి చెందుతారు. భవిష్యత్తులో గద్వాల ఆత్మకూర్, మక్తల్ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే విధంగా అవకాశం ఉంటుంది’’ అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, సర్పంచ్ సుజాత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

