Movie Ticket Price: సినిమా టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై(Movie Ticket Price) మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆదివారం స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టికెట్ ధరలు పెంచుతూ ఒకవైపు జీవో బయటికి వస్తుందని, కానీ, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి తనకు తెలియదని, తన ప్రమేయం లేదని చెబుతుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన దగ్గరికి ఫైల్ రాలేదని మంత్రి నిస్సహాయంగా చేతులెత్తేస్తారని విమర్శలు గుప్పించారు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిదని, జీవో ఇచ్చేది ఇంకొకరని మండిపడ్డారు. సాక్షాత్తు ఒక కేబినెట్ మంత్రికి తెలియకుండానే ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది? అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందని హరీశ్ రావు మండిపడ్డారు.
Read Also- Mass Maharaja: ‘మాస్ మహారాజ్’ బిరుదు పేటెంట్ తనదే అంటున్న హరీష్ శంకర్.. రవితేజ ఏం చేశారంటే?
సర్కారా.. సర్కస్ కంపెనీనా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుపుతున్నది నడుపుతున్నది సర్కారా?.. లేక సర్కస్ కంపెనీనా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా కొట్టుకుంటూ, మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. చెప్పేదొకటి, చేసేది మరొకటని, పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటని అన్నారు. తాను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వబోమంటూ చెప్పారని హరీశ్ రావు గుర్తుచేశారు. రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పటికే 3 సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారని విమర్శించారు. ఇవాళో రేపో మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారని అన్నారు. సినిమా టికెట్ల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా? అని అన్నారు.
Read Also- CM Revanth Reddy: గుండె వ్యాధులు నివారించే మిషన్తో పని చేద్దాం: సీఎం రేవంత్ రెడ్డి
ఒక హీరో సినిమాపై కక్ష
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ ఆరోపణ చేశారు. ‘‘మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే రూ.600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా?. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా?. పాలకుడు పాలసీతో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదు. గత పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూపలేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయి. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని అహంకారంతో, పగ ప్రతీకారాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం, మరొకరికి శత్రుత్వం ఉండకూడదు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలనకు పరాకాష్ట. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో?జ ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఆ మంత్రిని చూస్తే జాలేస్తోంది
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని హరీశ్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది. కానీ, ఆ శాఖ మంత్రేమో నాకు సంబంధం లేదు. నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి.. ఇపుడు ఉన్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు?. టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కొమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు. అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా?, లేనట్టా?. సంబంధిత శాఖా మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు?. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అంటే.. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా?. లేక, మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా?. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు’’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

