Uttam Kumar Reddy: చేతికొచ్చిన పంట భద్రత కోసం ఆధునిక పరిజ్ఞానంతో నిల్వ చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పేర్కొన్నారు. తద్వారా రైతుకు భరోసా కల్పించడంతో పాటు ఆహార భద్రతను పెంపొందించడం సులభతర అవుతుందని అన్నారు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, ఉత్పత్తి అయిన ధాన్యాన్ని పరిరక్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రైతు చేతికందిన ధాన్యం నష్ట పోకుండా ఉండేందుకు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థను అమలులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని తెలిపారు. సచివాలయంలో భారత ఆహార సంస్థ, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సైలో పద్ధతిలో
బియ్యం, మొక్క జొన్న, సోయాబీన్ వంటి పంటలను సైలో పద్ధతిలో నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుందని మంత్రి తెలిపారు. మనుషుల జోక్యం లేకుండానే ఈ విధానంలో ఉండే ఇంటిగ్రేటెడ్ క్లీనర్లు, డ్రైయర్లతో 2 సంవత్సరాల వరకు ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు పంపడంతో మిల్లింగ్లో జరుగుతున్న జాప్యంతో ధాన్యం చెడిపోయి నష్టం వాటిల్లుతున్నదని, మిల్లులలో శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేసే అవకాశం లేకపోవడంతోనే నష్టం జరుగుతున్నదని చెప్పారు. అటువంటి పరిస్థితిలో రైతాంగానికి భరోసా ఇవ్వడంతో పాటు ధాన్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం శాస్త్రీయమైన సైలో పద్ధతిని అమలులోకి తేవాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. సైలో పద్ధతిలో ఉండే డ్రైయర్ల ద్వారా తేమను తొలగించడంతో పాటు ధాన్యాన్ని దీర్ఘకాలికంగా పరిరక్షించుకోవచ్చని తెలిపారు. పాత బియ్యానికి మార్కెట్లో అధిక ధర లభిస్తుందన్నారు.
Also Read: Uttam Kumar Reddy: హరీశ్ రావు చూపించిన లేఖను సీడబ్ల్యూసీ ఆమోదించలేదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
కేంద్రం తీరుతో నష్టం
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల ప్రభావం దేశ వ్యాప్తంగా చూపుతున్నదని ఉత్తమ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన పేదలకు ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ, సన్నాలకు 500 బోనస్ వంటి సంస్కరణలతో దేశవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని చెప్పారు. ఆ క్రమంలోనే చేతి కొచ్చిన పంట పాడవకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైలో విధానాన్ని తీసుకొచ్చేందుకు చూస్తున్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.5,000 కోట్లు నష్ట పోతున్నదని ఆరోపించారు. సైలో పద్ధతిని అమలులోకి తెస్తే ఆ రూ.5,000 కోట్ల భారాన్ని అధిగమించడంతో పాటు రూ.1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పద్ధతిని అమలులోకి తేవాలని యోచిస్తున్నామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

