BRS: శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సెషన్ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ఈ సెషన్ మొత్తం హాజరు కాబోమని ప్రకటించింది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ప్రభుత్వ తీరును ఎండగట్టాలన్న ప్రజా సమస్యలను ప్రస్తావించాలన్న.. పేర్కొన్న అంశాలు రికార్డులో ఉండాలన్న అది అసెంబ్లీ వేదికగానే సాధ్యం. అయితే అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండడం పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని నీటి రంగంలోనూ ద్రోహం చేసిందని ప్రాజెక్టు నిర్మించలేదని ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఎండగడుతుంది. కానీ సభలో విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు గులాబీ ఎమ్మెల్యేలు లేరు. అసెంబ్లీలో చర్చలకు సంబంధించిన అంశం ప్రత్యక్ష ప్రసారం అవుతుండడం ప్రభుత్వం చెబుతున్న ప్రతి అంశం ప్రజల్లోకి వెళుతుండడంతో గులాబీ ఎమ్మెల్యేలు అంతర్ మదనం చెందుతున్నారు. అసెంబ్లీలో ఉండి ప్రతి అంశాన్ని కౌంటర్ ఇస్తే బాగుండును అని సన్నిహితుల వద్ద అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. బయట మీడియా సమావేశం నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిన ప్రజల్లోకి వెళ్లదని పలువురు పేర్కొంటున్నారు.
పదేళ్లలో టిఆర్ఎస్ నది జలాలపై సాధించిన విజయం
మూసి పునరుజీవనంపై హరీష్ రావును మాట్లాడనివ్వలేదనే కారణంతో ఈ నెల 2న సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ ఒక్కరోజు చేస్తే ఏమి కాకపోయేదని మరుసటి రోజు సభకు హాజరైతే బాగుండేదని పలువురు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలిసింది. సెషన్ మొత్తం వాకౌట్ చేయడంతో తమ నియోజకవర్గాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా అయిందని లోలోనా మదనపడుతున్నారు. ఈ నెల మూడున కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో నది జలాలపై టిఆర్ఎస్ అనుసరించిన విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ పై, విమర్శలు చేసింది. విధానాలను తప్పుపట్టింది. అయితే ఈ విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. సభలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉండేది. పదేళ్లలో టిఆర్ఎస్ నది జలాలపై సాధించిన విజయాన్ని చెప్పేవారు. ప్రజలకు వాస్తవాలు వివరించే అవకాశం ఉండేదని పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. వాకౌట్ తో ఆ అవకాశం లేకుండా పోయిందని పార్టీ తీరుపై అసంతృప్తి తో ఉన్నారు.
Also Read: BRS Party: కాంగ్రెస్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి.. గులాబీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం!
బహిష్కరించి తప్పు చేశాం
ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చేస్తున్న విమర్శలను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ లు పెట్టి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఏం లాభం అని పార్టీ నేతలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా కొట్లాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజల్లోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాయిస్ బలంగా వెళ్తుందని.. పార్టీ క్యాడర్ లోను చేసే ప్రతి విమర్శలు వారికి కొంత బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని.. సమావేశాలను బహిష్కరించి తప్పు చేశామని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం చేసే విమర్శలే ప్రజలకు కనెక్ట్ అవుతున్నాయని.. తాము చేసే కౌంటర్లు వెళ్లడం లేదని.. ప్రజల్లో పార్టీకి ఆదరణ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి అస్త్రం ఇచ్చినట్లు అవుతుందని.. స్థానిక ఎన్నికల్లో, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు నుంచి సైతం వ్యతిరేకత
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినప్పటికీ పార్టీ కార్యాచరణ మాత్రం అధిష్టానం ప్రకటించలేదు. ఎమ్మెల్యేలు ఏం చేయాలనే దానిపైన సూచనలు చేయలేదు. మూడు రోజులు గడిచినప్పటికీ కార్యచరణ ప్రకటించలేదు. కాంగ్రెస్, ఎంఐఎం, బిజెపి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ఉంటే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ కార్యాలయాలకు పరిమితమయ్యారు. దీంతో ప్రజలు నుంచి సైతం వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. పార్టీ అధినేత కేసిఆర్ ఏం కార్యాచరణ ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: KCR BRS LP: రాబోయేది మనమే.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. సాయంత్రం 6 గంటలకు ప్రెస్మీట్

