Etela Rajender: పాలిటిక్స్లో శాశ్వత శత్రవులు, మిత్రులు ఉండరు
ఉన్న శక్తే తక్కువ.. ఇందులో గ్రూప్స్ అవసరమా?
పరిపక్వతతో కలిసి పనిచేయాలి
గ్రూపులు బువ్వ పెట్టబోవు
మరోసారి చర్చనీయాంశంగా ఈటల కామెంట్స్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీజేపీలో వర్గపోరుపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడుతూ, ‘కాకులు, గద్దలు’ అంటూ విమర్శలు చేయడం రాజకీయ సెగ పుట్టిస్తోంది. తెలంగాణ బీజేపీలో అంతర్గత విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీలో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటూ పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతున్న తరుణంలో కొందరు నేతలు గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఈటల అసహనం వ్యక్తం చేశారు. పరోక్షంగా తెలంగాణలో బీజేపీకి ఉన్న శక్తే తక్కువ.. మళ్లీ ఇందులో గ్రూపులు అవసరమా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ గ్రూపులు ఎవరికీ బువ్వ పెట్టవని, కేవలం పార్టీ నష్టానికి మాత్రమే దారితీస్తాయని హితవు పలికారు.
Read Also- MLC Kavitha: అమరుల కుటుంబాలకు కోటి అందే వరకు పోరాటం.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
ఈటల రాజేందర్ చేసిన ‘కాకులు, గద్దలు’ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయని తెలిసింది. ఇంతకీ ఎవరి ఉద్దేశించి అన్నారంటూ అటు పార్టీలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చిన్నపాటి విభేదాలతో విడిపోకుండా, పరిపక్వతతో కలిసి పనిచేయాలని, వ్యక్తిగత ఎజెండాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఈటల అన్న విషయం తెలిసిందే. పార్టీలో చేరిన నాయకులను గౌరవించాలని, అక్కున చేర్చుకోవాలని చేసిన వ్యాఖ్యలు కొత్త నేతలపై వివక్షత ఇంకా కొనసాగుతోందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తవారిని కాకులు, గద్దల్లా పొడుచుకు తినడం మానుకోవాలని, రాజకీయాల్లో విశాల హృదయం, గొప్ప ఆలోచన ఉండాలని, పొడుచుకుతినే కౄరత్వం ఉండకూడదని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండబోరని ఈటల చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
Read Also- Gold Silver Prices: బాబోయ్… వెనిజులాపై అమెరికా దాడితో బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయా?
ఈటల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ వైరల్ అవుతున్నాయి. కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో పాత నేతలకు, కొత్తగా చేరిన వారికి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆ వర్గపోరును నిజం చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర పార్టీల వారిని తీసుకొచ్చి గెలిపించుకున్న చరిత్ర ఉందని ఈటల ప్రస్తావించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 1992 నుంచే ఉన్న తనను సొంత వారే నాన్ లోకల్ అని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. మరి ఈటల సూచనలను పార్టీలోని ఇతర నేతలు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారో.. అధిష్టానం ఈ గ్రూపు రాజకీయాలకు ఎలా అడ్డుకట్ట వేస్తుందో వేచి చూడాలి.

