నర్సంపేట, స్వేచ్ఛ : నర్సంపేటలోని విశాలమైన అంగడి స్థలంలో నిర్మించిన మార్కెట్ భవనం నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలతో ఐదేళ్ల క్రితం నిర్మించగా మూడేళ్ల క్రితం మంత్రులు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోడల్ కూరగాయల మార్కెట్ను నిర్మించామని చెప్పుకోవడానికి తప్ప ఈ భవనం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాపారులు అంటున్నారు.
కమీషన్ల కోసమే నిర్మించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రారంభం అయినప్పటికీ భవనంలో ఎలాంటి వ్యాపార కార్యక్రమాలు జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. రెండు అంతస్థుల భవనం ఉన్నా.. చిన్నగా ఉండడంతో వ్యాపారాల నిర్వహణకు ఇబ్బందిగా ఉంటుందనే కారణంతో వ్యాపారులు లోపలికి వెళ్లడానికి విముఖత చూపిస్తున్నారు. దీంతో ఆరు బయటే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఎండావాన కాలాల్లో అపరిశుభ్ర వాతావరణంలోనే కూరగాయలు విక్రయిస్తున్నారు.
Also Read : బెస్ట్ డైట్ అంటే ఈ దేశానిదే
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా..
మోడల్ కూరగాయల భవనం నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థకు చేరుతున్నది. దీంతో భవనంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మందుబాబులకు అడ్డాగా మారడంతో.. భవనంలో ఎక్కడ చూసినా పగిలిన మందు సీసాలు దర్శనమిస్తున్నాయి. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో అప్పటి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పలుమార్లు మార్కెట్ భవనాన్ని సందర్శించి అందులోనే వ్యాపారాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. నిధులు మంజూరు చేసి ఖర్చు చేసినప్పుడు ఉన్న శ్రద్ధ అమలులో చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కేవలం ఇది ప్రచారం కోసం మాత్రమే నిర్మించి వదిలేశారని, అనవసరంగా మార్కెట్ భవనం నిర్మించి స్థలం వృథా చేశారనే విమర్శలు వస్తున్నాయి. భవనం నిర్మించక ముందు ఉన్న విశాలమైన స్థలంలో మహిళలు బతుకమ్మను ఆడుకునేవారు. వివిధ పండుగలు కూడా ఇక్కడే చేసేవారు. ఇప్పుడు భవన నిర్మాణంతో ఇరుకుగా మారిందని చెబుతున్నారు. భవనం నిర్మించినా ఉపయోగంలో లేకపోవడం పట్ల స్థానికులు విమర్శలు చేస్తున్నారు. వ్యాపారులకు చిన్న రేకులషెడ్లు కూడా నిర్మించినా అవి కూడా ఉపయోగంలో లేవని తెలుస్తున్నది. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి భవనం ఉపయోగంలోకి తేవాలని కోరుతున్నారు.