GHMC Achievements 2025: 2025 సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. నవంబర్ వరకు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న నగరం, 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో ఏకంగా 2,050 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఈ మార్పుతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా అవతరించింది. పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించిన అధికారులు.. జోన్లను 6 నుంచి 12కు, సర్కిళ్లను 30 నుంచి 60కి పెంచారు. మున్సిపల్ వార్డుల సంఖ్య కూడా 150 నుంచి 300లకు చేరింది. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని మీడియాకు వివరించారు.
చెత్త నుంచి విద్యుత్..
హైదరాబాద్ నగరం స్వచ్ఛతలోనూ రికార్డులు సృష్టిస్తోంది. జవహర్నగర్లో ఇప్పటికే ఉన్న ప్లాంట్లకు తోడు భవనగిరిలో మరో 24 మెగావాట్ల ఆర్డీఎఫ్ ప్లాంట్ సిద్ధమవుతోంది. దీంతో మొత్తం 48 మెగావాట్ల విద్యుత్ను చెత్త ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరం 6వ ర్యాంకు సాధించడం గమనార్హం. నగర పౌరులకు అవగాహన కల్పిస్తూనే, రోడ్లపై చెత్త వేసే వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది కేవలం జరిమానాల రూపంలోనే రూ. 2.34 కోట్లు వసూలు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘మెగా శానిటేషన్ డ్రైవ్’ జనవరి వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
Also Read: Illegal Liquor Sales: మద్యం మత్తులో నియోజకవర్గం.. ప్రథమ స్థానంలో అశ్వారావుపేట రెండోస్థానంలో..?
ఆహార భద్రత – ప్రజారోగ్యం
ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ ఏడాది 9,656 తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు, మెస్లపై రూ. 14.84 లక్షల పెనాల్టీలు విధించారు. కూకట్పల్లిలో రూ. 5 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చారు. హెల్త్ పరంగా చూస్తే, గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ కేసులు 30 శాతం తగ్గడం విశేషం. జీఐఎస్ సాంకేతికతతో ఫాగింగ్ మిషన్లను అనుసంధానించడం వల్ల దోమల నివారణలో మంచి ఫలితాలు వచ్చాయని కమిషనర్ వివరించారు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్..
నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రూ. 7,038 కోట్లతో హెచ్ సిటీ ప్రాజెక్టు కింద 23 పనులు ప్రారంభం కానున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 అండర్ పాస్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆర్థికంగా కూడా జీహెచ్ఎంసీ బలోపేతం అవుతోంది. జీఐఎస్ సర్వే ద్వారా ఆస్తులను మ్యాపింగ్ చేయడంతో ఆస్తి పన్ను వసూళ్లు పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 3 నాటికి రూ. 1,512 కోట్ల పన్ను వసూలైంది. గతేడాదితో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ. డ్రోన్ సర్వే ద్వారా 14 లక్షల ఇళ్లను మ్యాపింగ్ చేయడంతో పన్ను ఎగవేతదారులను గుర్తించడం సులభతరమైందని అధికారులు పేర్కొన్నారు.
Also Read: Anvesh Controversy: యూట్యూబర్ అన్వేష్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి.. ఎందుకంటే?

