మహబూబాబాద్, స్వేచ్ఛ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మహబూబాబాద్లోని స్థానిక వివేకానంద సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేతన జీవులను పెద్దఎత్తున సంతృప్తి పరుస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ముష్టి వేసినట్టు ఊరట కల్పించారని మండిపడ్డారు.
దేశ ప్రజల బడ్జెట్ అంటూ ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని సాదుల శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఎంపీలున్నా తెలంగాణకు రావాల్సిన నిధులను రాబట్టలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీలు, రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐఎం, హైస్పీడ్ రైల్వే ట్రాక్లకు నిధుల ఊసే లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారని తెలిపారు.