Phone Tapping Case: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఓ పెన్ డ్రైవ్ కీలకంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న ఈ పెన్ డ్రైవ్ లోని సమాచారం ఆధారంగా సిట్ విచారణలో జోరును పెంచింది. ప్రస్తుతం కస్టోడియల్ అదుపులో ఉన్న ప్రభాకర్ రావు ఎదుట ఆ వివరాలను పెట్టి దర్యాప్తు అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎలాగైనా సరే ఎలక్షన్లలో విజయం దక్కించుకుని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నాయకులతోపాటు వారితో పరిచయాలు ఉన్న పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా బలమైన ఆరోపణలు వచ్చాయి. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణకు ఆదేశించింది.
వెలుగు చూడగానే
కాగా, ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దీని కోసం ఎస్ఐబీ కార్యాలయంలో రెండు గదులతో ప్రత్యేక వార్ రూంను ఏర్పాటు చేసుకున్నట్టుగా దర్యాప్తులో తేలింది. అయితే, చేసిన నిర్వాకం బయట పడగానే ప్రణీత్ రావు వార్ రూంలోని కంప్యూటర్లకు సంబంధించిన హార్డ్ డిస్కులతోపాటు ఇతర డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశాడు. కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్కులను ముక్కలు ముక్కలుగా చేసి నాగోల్ వద్ద మూసీ నదిలోకి విసిరేశాడు. తన పర్సనల్ మొబైల్ ఫోన్లలో ఉన్న డేటాను కూడా ఎరేజ్ చేశాడు. మరోవైపు కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు అమెరికా పారిపోయాడు. ఆ తరువాత ప్రభాకర్ రావు కూడా తన మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేయటం ద్వారా వాటిల్లో ఉన్న సమాచారన్ని ఎరేజ్ చేశాడు. క్లౌడ్ లో ఉన్న సమాచారాన్ని కూడా తుడిచేశాడు. అయితే, పాస్ పోర్టును రద్దు చేయించటం ద్వారా ప్రభాకర్ రావును వెనక్కి రప్పించిన సిట్ అధికారులు ఆయన నుంచి ఓ పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకోగలిగారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
సిట్ అధికారులు దర్యాప్తు
ప్రస్తుతం విచారణలో ఆ పెన్ డ్రైవ్ అత్యంత కీలకంగా మారింది. విశ్వసనీంగా తెలిసిన ప్రకారం పెన్ డ్రైవ్ నుంచి వందలకొద్ది ఫోన్ నెంబర్లను విచారణాధికారులు సేకరించినట్టు సమాచారం. వీరిలో రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిల నెంబర్లతోపాటు వారి ప్రొఫైల్స్ కూడా పెన్ డ్రైవ్ ద్వారా దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్టుగా తెలియవచ్చింది. ప్రభాకర్ రావు…ఆయన టీం చాలావరకు డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసినా ఈ పెన్ డ్రైవ్ నుంచి తెలిసిన వివరాల ఆధారంగా ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు అధికారులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మావోయిస్టులు, ఉగ్రవాదులు…వారి సానుభూతిపరుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉండగా రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తల నెంబర్లను ఎందుకు ట్యాప్ చేశారని సేకరించిన వివరాలను ముందు పెట్టి నిశితంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ లో సూత్రధారులు ఎవరు
అయితే, ఆధారాలను ఎదురుగా పెట్టి విచారణ చేస్తున్నా ప్రభాకర్ రావు మాత్రం ఫోన్ ట్యాపింగ్ లో సూత్రధారులు ఎవరన్నది మాత్రం బయట పెట్టటం లేదని సమాచారం. నేను ఎవరెవరి నెంబర్లను ట్యాప్ చేయించానో..ఆ సమాచారం అంతా నా పై అధికారులు, రివ్యూ కమిటీ సభ్యులకు తెలుసని మాత్రమే అంటున్నట్టుగా తెలిసింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్నది నిరూపించటానికి ఈ పెన్ డ్రైవ్ ఆధారం సరిపోతుందని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈనెల 26వ తేదీ వరకు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ జరిపే అవకాశం ఉండటంతో ఈ రెండు రోజుల్లో కీలక వివరాలను కక్కించాలని చూస్తున్నారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ.. ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం.. కానీ!

