ISRO Bahubali Rocket: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అరుదైన మైలురాయిని అందుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ ‘ఎల్వీఎం3-ఎం6’ (LVM3-M6) ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్.. అందరూ అనుకున్నట్లుగానే నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించి యావత్ దేశ ప్రజలను ఆనందంలో ముంచెత్తింది. కాగా ఇది ఇస్రో చేపట్టిన మరో విజయవంతమైన వాణిజ్య ప్రయోగం. అమెరికాకు చెందిన ‘ఏఎస్టీ స్పేస్ మెుబైల్’ (AST Space Mobile) సంస్థ రూపొందించిన ‘బ్లూబర్డ్ బ్లాక్ – 2’ (BlueBird Block-2) అనే భారీ ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టిది.
15 నిమిషాల్లోనే సక్సెస్..
భారత భూబాగం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్న అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే కావడంతో ఈ ప్రయోగాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెుత్తం మూడు దశల్లో ఇస్రో రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా తొలుత సతీశ్ ధావన్ స్పెస్ సెంటర్ నుంచి ఉదయం 8.55 గం.ల ప్రాంతంలో ‘ఎల్వీఎం3-ఎం6’ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నింగికేగిన 15 నిమిషాల తర్వాత బ్లూ బర్డ్ బ్లాక్ – 2 ఉపగ్రహం రాకెట్ ‘ఎల్వీఎం3-ఎం6’ రాకెట్ నుంచి విడిపోయి.. సుమారు 520 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. శాటిలైట్ల నుంచి నేరుగా మెుబైల్ కనెక్టివిటీని అందించాలన్న లక్ష్యంతో అమెరికన్ సంస్థ ఈ బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ చేపట్టింది. దీని ద్వారా ఎక్కడైనా, ఏ సమయానికైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్ అందించాలని ఏఎస్టీ స్పేస్ మెుబైల్ సంస్థ భావిస్తోంది.
A significant stride in India’s space sector…
The successful LVM3-M6 launch, placing the heaviest satellite ever launched from Indian soil, the spacecraft of USA, BlueBird Block-2, into its intended orbit, marks a proud milestone in India’s space journey.
It strengthens… pic.twitter.com/AH6aJAyOhi
— Narendra Modi (@narendramodi) December 24, 2025
6,100 కిలోల బరువు
‘బ్లూబర్డ్ బ్లాక్ – 2’ (BlueBird Block-2) అనే ఈ భారీ ఉపగ్రహం విషయానికి వస్తే దీని బరువు దాదాపు సుమారు 6,100 కిలోలు. ప్రపంచంలోని ఏ అంతరిక్ష సంస్థ కూడా ఇంత బరువు ఉన్న ఉపగ్రహాన్ని నింగిలో ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. 6.4 టన్నుల బరువు కలిగిన ఈ భారీ ఉపగ్రహాన్ని భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో-ఎర్త్ ఆర్బిట్ (LEO)లోకి ఇస్రో ప్రవేశపెట్టడం విశేషం. అయితే గతంలోనూ భారీ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన అనుభవం ఇస్రోకు ఉంది. గతంలో 4,400 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనుభవం ఇస్రోకు ఉంది. ఈ క్రమంలోనే మరో అతి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టే బాధ్యతను అమెరికన్ సంస్థ ఇస్రోకు అప్పగించడం గమనార్హం.
Also Read: YS Jagan: వైఎస్ జగన్కు అస్వస్థత.. ఇడుపులపాయ పర్యటన రద్దు.. ఆందోళనలో కార్యకర్తలు!
ప్రధాని ప్రశంసలు..
ఇస్రో చేపట్టిన ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. భారత అంతరిక్ష రంగంలో ఇదో ముఖ్యమైన పురోగతి అని మోదీ కొనియాడారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగ మార్కెట్ లో భారత్ కు ఉన్న సామర్థ్యాన్ని ఇది మరింత బలోపేతం చేసిందని కొనియాడారు. ఆత్మనిర్భర్ దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తోందని మోదీ అన్నారు. అంతకుముందు ఇస్రో ఛైర్మన్ డా.వి.నారాయణన్ (Dr. V. Narayanan) సైతం ప్రయోగం విజయవంతంపై స్పందించారు. ఎల్వీఎం ప్రయోగాల్లో నూరు శాతం విజయాలు సాధించినట్లు చెప్పారు. అతితక్కువ సమయంలో రాకెట్ రూపొందించి ప్రయోగం చేసినట్లు పేర్కొన్నారు.

