Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు
Phone Tapping Case (image credit: swetcha reporter)
Telangana News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల విచారణకు రంగం సిద్ధం!

Phone Tapping Case: సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ (KCR)కు నోటీసులు ఇవ్వాలని సిట్​ అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఆయనతోపాటు మాజీ మంత్రులు కేటీఆర్​, హరీష్​ రావులను కూడా విచారించాలని నిశ్చయించినట్టుగా సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాల తరువాత ముగ్గురినీ ప్రశ్నించాలని భావిస్తున్నట్టుగా తెలియవచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం కాంగ్రెస్​ ప్రభుత్వంలోకి వచ్చాక వెలుగు చూసిన విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసులు నమోదు

ఎలాగైనా సరే ఎన్నికల్లో విజయం దక్కించుకుని హ్యాట్రిక్​ సాధించాలని బీఆర్​ఎస్ లోని కీలక నేతలు ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నాయకుల ఫోన్లను ట్యాప్​ చేయించినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఉన్న ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారనుకున్న పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్​ చేయించినట్టుగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కాంగ్రెస్​ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసులు నమోదు చేసిన సిట్​ అధికారులు ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్​ రావులను అరెస్ట్​ చేశారు. విచారణలో ఈ నలుగురు వెల్లడించిన వివరాల ఆధారంగా బీఆర్​ఎస్​ హయాంలో ఎస్​ఐబీ ఛీఫ్​ గా పని చేసిన ప్రభాకర్​ రావును కేసులో ప్రధాన నిందితునిగా చేర్చారు.

Also Read: Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?

కొత్త సిట్​

ఫోన్​ ట్యాపింగ్ పై ప్రభుత్వం సిట్​ విచారణకు ఆదేశించినపుడు దానికి ఇన్​ ఛార్జ్​ గా జూబ్లీహిల్స్​ ఏసీపీ వెంకటగిరిని నియమించారు. కాగా, ఏసీపీ స్థాయిలో ఉన్న వెంకటగిరి ప్రశ్నలకు ఎస్​ఐబీ ఛీఫ్​ హోదాలో పని చేసిన ప్రభాకర్​ రావు సరిగ్గా స్పందించటం లేదన్న వార్తలొచ్చయి. ప్రధానంగా ఫోన్​ ట్యాపింగ్​ వెనక ఉన్న సూత్రధారులు ఎవరు? అన్నదాని గురించి ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రభాకర్​ రావు నోరు తెరవలేదు. తాను ఏం చేశానో..పై అధికారులు, రివ్యూ కమిటీ సభ్యులకు అంతా తెలుసు అని మాత్రమే సమాధానాలు ఇస్తూ వచ్చారు.

సీపీ సజ్జనార్​ నేతృత్వంలో

ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు వీలుగా డీజీపీ శివధర్​ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగా హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ ను సిట్ ఇన్​ ఛార్జ్ గా నియమించారు. ఆయనతోపాటు మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సిట్​ లో చేర్చారు. ఇక, సిట్​ ఇన్ ఛార్జ్​ గా నియామకం అయిన తరువాత సజ్జనార్ ఇప్పటివరకు సిట్​ జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాలను తెలుసుకున్నారు.

రాధాకిషన్ రావు వాంగ్మూలంలో

ఈ క్రమంలో ఆయన దృష్టికి టాస్క్​ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్​ రావు విచారణలో భాగంగా ఇచ్చిన వాంగ్మూలం వచ్చింది. ఎన్నికల సమయంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, హవాలా వ్యాపారుల నుంచి టాస్క్​ ఫోర్స్ పోలీసులు పెద్ద మొత్తాల్లో డబ్బు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహారించిన ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతోనే రాధాకిషన్​ రావు టాస్క్ ఫోర్స్​ బృందాలతో ఈ పని చేయించినట్టుగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సిట్​ అధికారులు రాధాకిషన్​ రావును నిశితంగా విచారించారు.

బీఆర్​ఎస్ సుప్రీం అంటూ

ఈ విచారణలో రాధాకిషన్​ రావు బీఆర్​ఎస్​ సుప్రీం కోసమే ఇదంతా చేశాం అని పరోక్షంగా కేసీఆర్​ పేరు చెప్పినట్టుగా సమాచారం. దాంతోపాటు బీఆర్​ఎస్​ లోని కొందరు ముఖ్య నేతల కోసమే ఫోన్​ ట్యాపింగ్​ చేశామని కూడా అన్నట్టుగా తెలిసింది. దాంతోపాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన కార్యాలయంలో ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్​ రెడ్డి పేరును కూడా రాధాకిషన్​ రావు ప్రస్తావించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి సిట్​ కార్యాలయానికి పిలిపించి సుధీర్ఘంగా ప్రశ్నించారు. ఎవరెవరి ఫోన్లను ట్యాప్​ చేయించారు? ఎవరు చెబితే ఈ పని చేశారు? అని అడిగినట్టుగా సమాచారం.

ప్రభాకర్​ రావును ఎస్​ఐబీకి ఛీఫ్​ గా ఎందుకు నియమించాల్సి వచ్చింది?

ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్​ కోసం విదేశాల నుంచి పరికరాలు తెప్పించినట్టుగా నిర్ధారణ అయిన నేపథ్యంలో దీంట్లో మీ పాత్ర ఏమిటి? అని కూడా రాజశేఖర్​ రెడ్డిని అడిగినట్టుగా తెలిసింది. దాంతోపాటు రిటైరైన తరువాత ప్రభాకర్​ రావును ఎస్​ఐబీకి ఛీఫ్​ గా ఎందుకు నియమించాల్సి వచ్చింది? అని కూడా ప్రశ్నించినట్టు సమాచారం. రాధాకిషన్​ రావు తన వాంగ్మూలంలో బీఆర్​ఎస్ సుప్రీం కోసమే అని పలుమార్లు ప్రస్తావించటంతోపాటు రాజశేఖర్ రెడ్డిని జరిపిన విచారణలో వెల్లడైన వివరాల నేపథ్యంలోనే తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రులు కేటీఆర్​, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని సిట్​ నిర్ణయించినట్టుగా తెలియవస్తోంది.

Also Read: Phone Tapping Case: లొంగిపోయిన ప్రభాకర్ రావు.. వారం రోజులపాటు కస్టడీ విచారణ!

Just In

01

Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్.. చర్యలు తప్పవ్!

Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

AP CM Chandrababu Naidu: ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ సాధిస్తే.. వారికి రూ. 100 కోట్లు ఇస్తా! మళ్లీ అదే సవాల్!

Ramchander Rao: ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ వేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Uttam Kumar Reddy: పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!