ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ వేసిన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ పై సుప్రీమ్ ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని వ్యాఖ్యానించిన జస్టిస్ బేలా త్రివేది.. పిటిషన్ ని కొట్టేశారు. కాగా, చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన ఏడు కేసులు సిబిఐకి బదిలీ చేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య పిటిషన్ దాఖలు చేశారు.
బాలయ్య తరపు వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సిద్ధమవగా… ఆయనపై జస్టిస్ బేలా త్రివేది తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పిటిషన్కు సంబంధించిన ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తాము అని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ బాలచంద్ర వరాలే ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా వినకుండానే ధర్మాసనం పిటిషన్ ను డిస్మిస్ చేసింది.