Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. పార్టీ నేతల తీరుపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Modhi) అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) నివాసంలో టీబీజేపీ(TGBJP) ఎంపీలంతా డిన్నర్ మీటింగ్ కు హాజరైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇటీవల టీబీజేపీ ఎంపీతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో నేతలు ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తంచేశారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా కీలక నేతల మధ్య సమన్వయ లోపం, ప్రజా సమస్యలపై పోరాటాల్లో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రధాని మోడీ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ హెచ్చరికలతో మేల్కొన్న కమలనాథులు.. పార్టీలో కొత్త ఉత్సాహం నింపే పనిలో పడ్డారని, అందుకే ఈ భేటి అని చర్చించుకుంటున్నారు.
సర్పంచ్ ఎన్నికలు
గతంతో పోలిస్తే తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ బలోపేతం కావడం, గణనీయమైన స్థానాల్లో విజయం సాధించడం అగ్ర నాయకత్వానికి ఆక్సిజన్ అందించింది. ఇదే స్ఫూర్తిని తదుపరి ఎన్నికల్లోనూ కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. సర్పంచ్ ఎన్నికలు ఇచ్చిన స్ఫూర్తితో ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) నుంచి మున్సిపల్(Muncipal), జీహెచ్ఎంసీ(GHMC) వరకు తమ సత్తా ఏంటో చాటాలని పార్టీ భావిస్తోంది. అందుకే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా తమ వైపు తిప్పుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డిన్నర్ మీటింగ్ వేదికగా నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి, మున్సిపల్ పోరులో సత్తా చాటాలని కాషాయ దళం సిద్ధమవుతోంది.
అంతర్గత కుమ్ములాటలే ఎక్కువ
తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయం ఇప్పుడు ఢిల్లీ గల్లీల వరకు పాకింది. రాష్ట్ర ఎంపీ(MP)ల పనితీరుపై సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. రాష్ట్ర కమల దళంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ప్రధాని మోడీ నుంచి వచ్చిన చీవాట్లు ఎంపీలకు మింగుడు పడటం లేదు. నియోజకవర్గాల్లో పట్టు కంటే, అంతర్గత కుమ్ములాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే నివేదికలు అధిష్టానానికి చేరాయి. గ్రూపు రాజకీయాలు మాని.. పార్టీ కోసం పనిచేయండి అన్న మోదీ ఆదేశం ఇప్పుడు ఎంపీలను ఒకే టేబుల్ ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసం వేదికగా జరిగిన డిన్నర్ మీటింగ్ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి బండి సంజయ్(Bandi Sanjay), ఈటల రాజేందర్(Etela Rajender), డీకే అరుణ(DK Aruna), అర్వింద్, రఘునందన్ రావు(Ragunandan Rao) వంటి కీలక నేతలు హాజరై.. రానున్న జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకూడదనే నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. టీబీజేపీ నేతలంతా పైకి ఐకమత్యంగానే కనిపించినా.. నేతల మధ్య ఉన్న అంతర్గత అగాధాలు అంత సులభంగా పూడ్చుకుపోతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ఎంపీలకు ప్రధాని మోడీ చీవాట్ల ఎఫెక్ట్ విందు రాజకీయాల వరకు వచ్చింది. ఇకనైనా ఎంపీల మధ్య విభేదాలు సమసిపోతాయా? ఐక్యతతో వారు పనిచేస్తార? లేదా? అనేది భవిష్యత్ లో తేలనుంది.
Also Read: Karimnagar Cricketer: ఐపీఎల్లో కరీంనగర్ కుర్రాడు.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అమన్ రావు ఎంపిక!

