స్వేచ్ఛ, స్పెషల్ డెస్క్: ఏపీలో ‘అందరికీ ఇళ్లు’ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుండగా, స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి. ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఆధార్, రేషన్కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుండగా, రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయితే ఇల్లు, స్థలాలు మంజూరు చేసి హక్కులు మాత్రం పదేళ్ల తర్వాత కల్పించేలా ప్రణాళికలు రూపొందించడం గమనార్హం.
అర్హతలు ఇవే..
‘రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఏపీలో సొంత స్థలం/ఇల్లు ఉండకూడదు. గతంలో ఇంటి పట్టా పొంది ఉండకూడదు. 5 ఎకరాల్లోపే మెట్ట, 2.5 ఎకరాల్లో మాగాణి ఉండాలి. గతంలో స్థలం పొందిన వారు రద్దు చేసుకుంటే కొత్తది ఇస్తారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ, వీర్వో/ఆర్ఐతో ఎంక్వైరీ ఉంటుంది. గ్రామ/వార్డు సభల్లో అభ్యంతరాలను స్వీకరిస్తాం. కలెక్టర్లు, తహశీల్దార్లు, కమిషనర్లు తుది జాబితా ప్రకటిస్తారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేస్తాం. రెండేళ్లలో నిర్మాణం చేపట్టని సైట్స్ను రద్దు చేసే అధికారాన్ని ఆఫీసర్లకు ఇస్తున్నాం’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.