అమరావతి, స్వేచ్ఛ: జనసేన కార్యకర్తలు పదవుల కోసం టైం వేస్ట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఇకపై అలా చేయొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) హెచ్చరించారు. ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే పదవులు అవే వస్తాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై పార్టీ నేతలు దృష్టి సారించాలని సూచించారు. ఇతర పార్టీ నేతలతో రహస్యంగా లేఖలు, పరిచయం పెంచుకుంటున్నారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి మండిపడ్డారు.
ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇటీవల ప్రమాదాల్లో చనిపోయిన 22 మంది జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఆదివారం రూ.5లక్షల చొప్పున నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కార్యకర్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. అయితే, కొంతమంది మూర్ఖులు సోషల్ మీడియాలో కావాలనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడూ రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేయలేదని, సమస్యలపైనే పోరాటం చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా నాదెండ్ల గుర్తు చేశారు.
Also Read : నాలుగు పథకాలు ప్రారంభించిన సీఎం
Nadendla Manohar : చేసిన సాయం మరిస్తే ఎలా?
‘చంద్రబాబు అరెస్టు సమయంలో జైలు దగ్గర పవన్ మాటలతోనే కదలిక మొదలైంది. రాష్ట్ర ప్రజల కోసం అధినేత నిలబడ్డారు. చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు పవన్ కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు అర్థం చేసుకోవాలి. పదవులు ఉన్నా, లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. 928 మంది కార్యకర్తలకు బీమా పథకం ద్వారా పవన్ కల్యాణ్ చేతుల మీదుగా రూ. 24 కోట్లు అందించారు. ఇలా ఎవరైనా, ఏ పార్టీ వారైనా ఇవ్వగలిగారా? ఆపదలో ఉన్న కార్యకర్తలకు, జనసైనికులందరూ కలిసి సాయం చేసిన రోజులు కూడా ఉన్నాయి. పవన్ చేసిన సాయాన్ని మర్చిపోతే ఎలా? పవన్ కల్యాణ్ ఎప్పుడూ పదవుల కోసం పని చేయరు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో పార్టీ కార్యకర్తలు పనిచేశారు. జనసేనలో కార్యకర్తల మధ్య ఎవరైతే చిచ్చులు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని నాదెండ్ల మనోహర్ సూచించారు.