Thummala Nageswara Rao: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో నెలకు సుమారు లక్ష టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నప్పటికీ తెలంగాణకు కేవలం 40 నుంచి 50% మాత్రమే కేటాయింపులు జరుగుతున్నాయని, ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70% తెలంగాణకు కేంద్రం కేటాయిస్తే బాగుండేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్ ఎఫ్ సి ఎల్( రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ అధికారులతో మంత్రులు శ్రీధర్ బాబు తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉత్పత్తిలో ఎటువంటి అవంతరాలు వచ్చినా, ప్రత్యామ్నయ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కంపెనీ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.
యూరియా సరఫరాలో తీవ్ర ఇబ్బందులు
గత ఖరీఫ్ సీజన్లో రామగుండంలో ఎరువుల ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల తెలంగాణ రైతులకు యూరియా సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురైన విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ నుంచి 2,05,315 మెట్రిక్ టన్నుల కేటాయింపులకు గాను కేవలం 1,10,720 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా కావడం వల్ల లోటు ఏర్పడిందని తెలిపారు. ఈ లోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరినప్పటికీ సమయానికి స్పందన లేకపోవడం వల్ల రైతులు నష్టపోయారని అన్నారు.
Also Read: Thummala Nageswara Rao: రబీకి సరిపడా యూరియా కోసం.. కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల లేఖ
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం
పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రబీ సీజన్కు సంబంధించి ఆర్ ఎఫ్ సి ఎల్ తీసుకుంటున్న చర్యలు, ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. దీనికి స్పందించిన కంపెనీ ప్రతినిధులు, గత ఖరీఫ్లో హెచ్ టి ఆర్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిందని, రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు చింతిస్తున్నామని తెలిపారు. ఈ రబీలో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
రైతులకు వేగంగా ఎరువులు అందించవచ్చు
అక్టోబర్, నవంబర్ నెలల్లో కేటాయింపుల మేరకు యూరియాను సరఫరా చేశామని, డిసెంబర్ నెలలో కూడా 50,450 మెట్రిక్ టన్నుల సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రామగుండంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70 శాతం అయినా తెలంగాణకే కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గి, రైతులకు వేగంగా ఎరువులు అందించవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని పరిశ్రమల శాఖ ఎండీని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. అలాగే ఉత్పత్తిలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఎన్ ఎఫ్ ఎల్ కంపెనీ ప్రతినిధులను మంత్రులు ఆదేశించారు.
Also Read: Thummala Nageswara Rao: యూరియా తగ్గింపుపై దృష్టి పెట్టండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు!

