Kishan Reddy: తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని దాదాపు రూ.10 లక్షల కోట్ల రుణాలతో అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అందుకోసం భూములను అమ్ముకోవాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా అమ్మాలని ప్రయత్నిస్తే సుప్రీం కోర్టు చీవాట్లు పెడితే తప్ప వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్(హెచ్ఐఎల్ టీ) పాలసీ పేరిట రేవంత్ రెడ్డి పెద్ద భూదందాకు తెరదీశారని ఆరోపించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పారిశ్రామిక వాడలను తరలించాలని, ఆ భూములను కమర్షియల్ అవసరాల కోసం వినియోగించుకునేందుకు మార్చుకునేలా అనుమతి ఇస్తూ జీవో 27 తీసుకొచ్చారన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజల ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ జీవో తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులతో, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులతో, పరిశ్రమల యజమానులతో చర్చించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి పాలసీ తీసుకొచ్చే ముందు ఎక్స్పర్ట్ కమిటీతో అధ్యయనం చేయించాలని, కానీ అలాంటిదేమీ లేకుండానే.. పాలసీ తీసుకొచ్చిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి వారంలోగా నివేదిక ఇవ్వాలని సూచించారన్నారు.
Also Read: Kishan Reddy: హైదరాబాద్ సంస్థానానికి ఆయన కంటే గొప్ప చేసిందెవరు లేరు: కిషన్ రెడ్డి
కార్మికుల బతుకులు ఏమైపోతాయని ఆలోచించారా?
2014 నుంచి అన్నీ తానై వ్యవహరిస్తూ అన్ని నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ మేధావి లాగే సీఎం రేవంత్ రెడ్డి రూపంలో మరో కొత్త మేధావి తెలంగాణ ప్రజలకు దొరికారంటూ ఎద్దేవాచేశారు. రేవంత్ రెడ్డి కూడా ఇష్టమొచ్చినట్టు మేధావిలాగే ఎవరినీ అడగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని చురకలంటించారు. ఈ పాలసీ తీసుకొచ్చే ముందు లక్షలాది మంది కార్మికుల బతుకులు ఏమైపోతాయని ఆలోచించారా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. పరిశ్రమలు తరలిండచడంతో వారి భవిష్యత్ గురించి కనీసం గుర్తు చేసుకున్నారా? అని నిలదీశారు. దూరప్రాంతాలకు పరిశ్రమలు తరలిస్తే వారంతా ఎక్కడికి వెళ్లాలి? వారి కుటుంబాలు ఏమైపోవాలని ప్రశ్నల వర్షం కురిపించారు.
రైతులకు తీరని ద్రోహం
హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం 2013లో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ రూపొందించారని, దీంతో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఏమోగానీ రైతుల పాలిట మాత్రం శాపంగా మారిందని కిషన్ రెడ్డి వివరించారు. ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేని కన్జర్వేషన్ లాంటి జోన్ల కిందికి రైతుల భూములు రావడంతో వారు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్లు రావట్లేదన్నారు. తమ జోన్ మార్చాలని రైతులు ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం.., అడగకుండానే పారిశ్రామికవేత్తలకు మాత్రం కన్వర్ట్ చేసుకునే వీలు కల్పిస్తూ.. రైతులకు తీరని ద్రోహం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం
ఈ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా బెంగళూరులో పరిశ్రమలు తరలిపోతున్నాయని, అలాంటిది.. హైదరాబాద్ ను కూడా మరో బెంగళూరుగా మార్చాలని చూస్తున్నారా? అంటూ నిలదీశారు. అసలు ట్రాఫిక్ సమస్య, డ్రైనేజీ సమస్య గురించి ఏనాడైనా అధ్యయనం చేశారా అంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఈ పారిశ్రామికవాడల్లో భారీ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలంగాణ సమాజం అనుమానాలు వ్యక్తం చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చే ఈ పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Kishan Reddy: త్వరలో అందుబాటులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్: కిషన్ రెడ్డి
