Indigo Flights: దేశీయ విమానయాన మార్కెట్లో ఏకంగా 60 శాతానికి పైగా వాటా కలిగిన ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన (Indigo Airlines) విమాన సర్వీసుల్లో గత కొన్ని రోజులుగా సందిగ్ధ పరిస్థితులు నెలకొంటున్నాయి.పెద్ద సంఖ్యలో విమానాల రద్దులు, ఆలస్యాలు (Indigo Flights) జరుగుతున్నాయి. బుధవారం కూడా అదే పరిస్థితి కనిపించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన ఎయిర్పోర్టుల్లో సుమారుగా 200లకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, లేదా ఆలస్యం కావడం జరిగాయి. దాదాపు 85 సర్వీసులు రద్దయ్యాయి. దీంతో, వేలాది మంది ప్యాసింజర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ప్రధాన కారణాలు ఇవే
ఇండిగో విమానాలు ఆలస్యం, రద్దు కావడానికి పలు కారణాలు ఉన్నాయి. కొత్త డీజీసీఏ నిబంధనలు (FDTL) కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్తగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ రూల్ ప్రకారం, పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ఎక్కువగా విశ్రాంతి సమయం ఇవ్వడం తప్పనిసరిగా ఉంది. ఈ నిబంధనలకు అనుగుణంగా తమ భారీ విమాన నెట్వర్క్ షెడ్యూల్లో మార్పులు చేసుకోవడంలో ఇండిగో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫలితంగా, తగినంత సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
Read Also- Mana Shankara Vara Prasad Garu: వెంకీమామ పోస్ట్కు చిరు, అనిల్ రావిపూడి రిప్లయ్ చూశారా!
సాంకేతిక సమస్యలు, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లు
చిన్నపాటి సాంకేతిక లోపాలు కూడా ఇండిగో విమానాలను కొన్ని సందర్భాల్లో రద్దుకు, ఆలస్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా, ఎయిర్బస్ ఏ320 విమానాలకు సంబంధించిన అంతర్జాతీయ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ రూల్స్, భద్రతా కారణాల మరికొన్ని విమానాలను తాత్కాలికంగా సర్వీసుకు దూరంగా ఉంచాల్సి వస్తోంది. మరోపక్క వాతావరణ పరిస్థితులు కూడా విమాన సర్వీసులను దెబ్బతీస్తున్నాయి. శీతాకాలం కావడంతో కొన్నిసార్లు తీవ్రమైన పొగమంచు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా షెడ్యూల్ కూడా ప్రభావితం అవుతోంది.
Read Also- Formula E car Race case: మెున్న కేటీఆర్.. నేడు అరవింద్ కుమార్.. ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం!
ఇండిగో క్షమాపణలు
ఇంత పెద్ద సంఖ్యలో విమానాల సర్వీసుల్లో ఏర్పడుతున్న అంతరాయాలపై ఇండిగో ఎయిర్లైన్స్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. క్షమించాలంటూ ప్యాసింజర్లను కోరింది. గత రెండు రోజులుగా ఇండిగో కార్యకలాపాలు తీవ్ర అంతరాయానికి గురైన విషయం నిజమేనని, ఈ అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని పేర్కొంది. రద్దయిన విమానాలకు సంబంధించి టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్యాసింజర్లకు రీఫండ్ అందజేస్తామని ఇండిగో తెలిపింది. ఇక, విమాన సర్వీసులను వీలైనంత త్వరగా సాధారణ స్థితీకి తీసుకొచ్చి, సేవలను పునరుద్ధరించడానికి తమ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపింది. ఎయిర్పోర్టుకు వెళ్లే ముందే తమ ప్లైట్ స్టేటస్ను ముందుగానే చూసుకోవాలని ప్యాసింజర్లకు ఇండిగో ఒక సూచన చేసింది.
